చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. విమానాలు రద్దు..!
ప్రపంచదేశాలకు పాకిన తర్వాత చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ భావించారు. అయితే.. సంవత్సరం తిరిగే సరికి మళ్లీ ఈ వైరస్ విజృంభించడం మొదలుపెట్టింది.
కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయమై ఏడాది పూర్తయ్యింది. ఏడాది క్రితం ఈ మహమ్మారి చైనాలోనే పుట్టింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలను చుట్టేసింది. అప్పటి నుంచి ఈ మహమ్మారికి మందు కనిపెట్టడానికి అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రపంచదేశాలకు పాకిన తర్వాత చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ భావించారు. అయితే.. సంవత్సరం తిరిగే సరికి మళ్లీ ఈ వైరస్ విజృంభించడం మొదలుపెట్టింది.
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్ పోర్టులలో ఒకటైన పుడాంగ్ ఎయిర్ పోర్టులో విమాన సేవలను రద్దు చేశారు. షాంఘై ప్రాంతంలో ఇటీవల ఏడుగిరికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు గుర్తించారు. కాగా.. ఈ ఏడుగిరికి ఎయిర్ పోర్టుతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే విమానాశ్రయంలో వైమానిక సేవలను నిలిపివేశారు.
అక్కడ పనిచేసే సిబ్బందికి సైతం వెంటనే పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ కేసులు ప్రారంభమైన కొత్తల్లో కూడా చైనాలో ఇలానే వైరస్ వ్యాపించింది. అప్పుడు లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వంటి పద్ధతుల ద్వారా ఈ వైరస్ను చైనా చాలా వరకు నియంత్రించింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇక్కడ కరోనా క్లస్టర్ కనిపించింది.
ఈ కేసులన్నింటికీ పుడాంగ్ ఎయిర్పోర్టుతో సంబంధం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు, అత్యవసర సిబ్బందికి చైనా ప్రభుత్వం అందజేస్తున్న ప్రయోగాత్మక వ్యాక్సీన్ తెరపైకి వచ్చింది. ఈ వ్యాక్సీన్ను ఎయిర్పోర్టు సిబ్బందికి కూడా ఇస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు.
మొత్తానికి పుడాంగ్ విమానశ్రయం మూసివేయడంతో ఇక్కడ దాదాపు 500 విమాన సేవలు రద్దయ్యాయి. మొత్తమ్మీద 17,700మందికి కరోనా స్వాబ్ టెస్టులు చేశారు.