థాయ్లాండ్లో కాల్పుల కలకలం.. 32 మంది దుర్మరణం.. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే..
థాయ్లాండ్లోని ఈశాన్య ప్రావిన్స్లో జరిగిన సామూహిక కాల్పుల్లో 32 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు
థాయ్లాండ్లోని ఈశాన్య ప్రావిన్స్లో జరిగిన సామూహిక కాల్పుల్లో 32 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. నిందితుడు నోంగ్ బువా లామ్ ఫులోని చైల్డ్ కేర్ సెంటర్లో ఈ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పులు జరిగిన ఘటనను అక్కడి అధికారులు ధ్రువీకరించారు. థాయ్లాండ్లోని ఈశాన్య ప్రావిన్స్లోని పిల్లల డే కేర్ సెంటర్లో గురువారం జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం 32 మంది మరణించారని పోలీసు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందులో ఎక్కువ మంది చిన్నారులేనని తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి మాజీ పోలీసు అధికారి అని.. అతని కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు.
చైల్డ్ కేర్ సెంటర్లో కాల్పులు చోటుచేసుకోవడంతో.. అక్కడి నుంచి చాలా మంది భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నట్టుగా అక్కడ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పలువురికి గాయాలు అయితే ఇప్పటివరకు పోలీసులు నిందితుడిని పట్టుకోలేదని తెలిపాయి.
మరోవైపు కాల్పులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన వివరాలు అక్కడి అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిందితుడికి సంబంధించి ఆచూకీ గానీ, ఏదైనా ఆధారాలు గానీ తెలిస్తే.. తమకు వెంటనే సమాచారం అందజేయాలని కోరారు.