అమెరికాను భయపెడుతున్న బాంబు పార్శిల్స్ :ఒబామా,హిల్లరీ, సోరస్ నివాసాలకు పార్శిల్స్
అమెరికాలో పేలుడు పదార్థాల పార్శిల్స్ భయాందోళనకు గురి చేస్తున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్ష భవనం వైట్హౌస్కి, మాజీ అధ్యక్షుల నివాసాలకు, బిలియనీర్ జార్జ్ సోరస్ ఇంటికి, అలాగే సీఎన్ఎన్ మీడియా సంస్థకు అనుమానాస్పద ప్యాకెట్ పార్శిల్స్ వచ్చాయి. పార్శిల్ ని విప్పి చూడగా వాటిలో పేలుడు పరికరాలు, పదార్థాలు భయటపడటం కలకలం రేపుతున్నాయి.
వాషింగ్టన్ : అమెరికాలో పేలుడు పదార్థాల పార్శిల్స్ భయాందోళనకు గురి చేస్తున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్ష భవనం వైట్హౌస్కి, మాజీ అధ్యక్షుల నివాసాలకు, బిలియనీర్ జార్జ్ సోరస్ ఇంటికి, అలాగే సీఎన్ఎన్ మీడియా సంస్థకు అనుమానాస్పద ప్యాకెట్ పార్శిల్స్ వచ్చాయి. పార్శిల్ ని విప్పి చూడగా వాటిలో పేలుడు పరికరాలు, పదార్థాలు భయటపడటం కలకలం రేపుతున్నాయి.
అయితే కలకలం రేపుతున్న ఈ ప్యాకెట్ లు మెుదట మంగళవారం బిల్ క్లింటన్ నివాసానికి, బుధవారం ఒబామా నివాసానికి వచ్చాయని ఎఫ్బీఐ ప్రకటించింది. అయితే ఈ ప్యాకెట్లు వచ్చిన సమయంలో హిల్లరి దంపతులు ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్యాకెట్లపై దర్యాప్తు కొనసాగుతుందని ఎఫ్బీఐ అధికారులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
మాజీ అధ్యక్షులు, ప్రముఖుల ఇళ్లకు వస్తోన్న ఈ అనుమానాస్పద ప్యాకెట్ల అంశంపై వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి భయపెట్టే చర్యలు చట్ట వ్యతిరేకమైనవని మండిపడింది. అసహ్యమైనవంటూ ఖండించింది. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారు ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. అయితే ఈ ప్యాకెట్ వచ్చిన వారందరికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చింది.
సీఎన్ఎన్ మీడియా సంస్థకు పార్శిల్ వచ్చింది. అప్పటికే పార్శిల్ పై ప్రచారం ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ అలారమ్ మోగించి తన సిబ్బందిని బయటకు పంపించింది. ఆ తర్వాత ఓపెన్ చేసి చూడగా పేలుడు పరికరాలు ఉండటంతో ఎఫ్ బీ ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.
న్యూయార్క్లోని హిల్లరీ కార్యాలయానికి అనుమానాస్పద ప్యాకెట్ రావడంతో సీక్రెట్ సర్వీసెస్ ఉద్యోగి స్కానింగ్ చేశారు. ఆ సమయంలో అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే వాషింగ్టన్లోని ఒబామా కార్యాలయానికి వచ్చిన పార్శిల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు సీక్రేట్ సర్వీసెస్ స్పష్టం చేసింది.
అప్పటికే రెండు రోజుల క్రితం బిలియనీర్ జార్జ్ సోరస్ కు ఇలాంటి పార్శిల్ ప్యాకెట్ వచ్చింది. సోరస్ ఇంటికి వచ్చిన పార్శిల్ ను స్కానింగ్ చేస్తున్న సమయంలో బాంబు ఉన్నట్లు బృందాలు గుర్తించాయి. ఆ ప్యాకెట్ ను తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేసినట్లు తెలిసింది.
అయితే సీక్రేట్ సర్వీసెస్ ఈ ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అరెస్ట్ లు జరగలేదని ఎఫ్ బీఐ తెలిపింది. ఆ పార్శిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై విచారిస్తున్నట్లు తెలిపారు.