సౌదీ అరేబియాలో 10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. ఈ ఏడాది మొత్తం 132 మందికి మరణదండన..
సౌదీ అరేబియాలో పది రోజుల్లో 12మందికి శిరచ్చేదం చేశారు. దీంతో కలిసి ఈ యేడాది ఇప్పటివరకు 132మందికి మరణ దండన విధించారు.
రియాధ్ : శిక్షల విషయంలో సౌదీ అరేబియా చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్న విషయం తెలిసిందే. ఇక మరణ దండన విషయంలో సౌదీ అరేబియా అస్సలు రాజీపడటం లేదు. పదిరోజుల్లోనే 12 మంది దోషులకు మరణశిక్ష అమలు చేసింది. వీరంతా డ్రగ్స్ కేసులో నేరం రుజువైన వారు. ఇలాంటి శిక్షలు తగ్గిస్తామని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు.
ఈ పన్నెండు మందితో కలిపి ఈ ఏడాది మొత్తం 132 మంది దోషులకు శిరచ్ఛేదం చేసింది సౌదీ ప్రభుత్వం. 2020, 2021 రెండేళ్లలో అమలైన మొత్తం మరణశిక్షల కంటే ఈ సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడు మరణశిక్ష విధించిన 12 మందిలో ముగ్గురు పాకిస్థానీయులు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్ కు చెందినవారు, ముగ్గురు సౌదీ పౌరులు ఉన్నారు.
ప్రధాని ఆహ్వానం మేరకు భారత్ పర్యటించనున్న సౌదీ రాజకుమారుడు!
మరణ శిక్షలను తగ్గించే విషయంపై ఆలోచిస్తున్నామని ఈ శిక్షలను వీలైనంత తక్కువగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని 2018లో సౌదీ యువరాజు తెలిపారు. జమల్ కషోగ్గీ హత్య తరువాత మరణశిక్షను సవరించేలా చట్టంలో మార్పులు చేయాలని 2020లో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అహింసా నేరాల్లో మృధువుగా వ్యవహరించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడం లేదు.