శాంసంగ్ నుంచి మడతపెట్టే ఫోన్.. ధర ఎంతో తెలుసా..?
త్వరలోనే మార్కెట్లోకి
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్.. తొలిసారిగా మడతపెట్టడానికి వీలుగా ఉండే (ఫోల్డెడ్ స్మార్ట్ ఫోన్) స్మార్ట్ ఫోన్ ని వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. కొత్త టెక్నాలజీతో తయారుచేస్తున్న ఈ ఫోన్ను శామ్సంగ్ ఏకంగా 2 మిలియన్ల దక్షిణ కొరియా వన్లకు విక్రయించాలని భావిస్తోందట. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. లక్షా 25వేలు. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.
ఈ ఫోన్ తయారీ కోసం అవసరమయ్యే విడిభాగాల సరఫరా నవంబరు నుంచి ప్రారంభం కానుందని ఇటీవల కొరియా టైమ్స్ కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత వాటిని అసెంబుల్ చేసి స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2019 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
7.3 అంగుళాల డిస్ప్లేతో ఈ ఫోన్ను తీసుకొస్తున్నారట. దీన్ని లోపలివైపుకు, బయటివైపుకు మడతబెట్టేలా రూపొందించనున్నారు. మడతబెట్టిన తర్వాత స్క్రీన్ 4.5 అంగుళాలు ఉంటుంది. ప్రపంచంలోనే తొలి మడతబెట్టే స్మార్ట్ఫోన్ను తమ సంస్థ నుంచే తీసుకురావాలని శామ్సంగ్ భావిస్తోంది. మరోవైపు యాపిల్, హువావే, మోటొరోటా, జడ్టీఈ లాంటి మొబైల్ ఉత్పత్తుల సంస్థలు కూడా ఈ టెక్నాలజీపై ఫోన్లను తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నాయి. మరి ఏ కంపెనీ ఫోన్ ముందుగా వస్తుందో చూడాలి.