ఉక్రెయిన్, రష్యా మధ్య మొదలైన యుద్ధం వంద రోజులకు చేరుకుంది. ఇప్పటి వరకు మాస్కో సేనలు ఉక్రెయిన్ దేశంలోని 20 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. ఈ విషయాన్ని వోలోడిమిర్ జెలెన్స్కీ ధృవీకరించారు.
ఉక్రెయిన్ కు, రష్యాకు యుద్దం కొనసాగుతోంది. రష్యా సేనలు ఉక్రెయిన్ బలగాలు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. ప్రతీ రోజు రెండు వైపులా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. అయినా రెండు దేశాలు కూడా తగ్గడం లేదు. తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. మాస్కో సైన్యం రోజు రోజుకు ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటూ పోతోంది. ఇప్పటి వరకు యుద్దం 100వ రోజుకు చేరుకుంది. దీంతో ఉక్రెయిన్ లోని ఐదో వంతు అంటే 20 శాతం భూభాగాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది.
ఈ విషయాన్ని ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు ధృవీకరించారు. లక్సెంబర్గ్ చట్టసభ్యులను ఉద్దేశించి వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రసంగిస్తూ.. తన దేశ భూభాగంలో 20 శాతం రష్యన్ దళాల నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు. మాస్కో నియంత్రణలో ఉన్న భూభాగాలు నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్ ల కంటే పెద్దవి అని ఆయన తెలిపారు. ప్రతి రోజూ 100 మంది ఉక్రేనియన్ సైనికులు చనిపోతున్నారని జెలెన్స్కీ చెప్పారు.
Russia Ukraine war: రష్యాకు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలు.. ఉక్రెయిన్-రష్యా వార్ అప్డేట్స్
ఉక్రెయిన్ లోని ఖార్కివ్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో రష్యా దళాలు విఫలం అవ్వడంతో ఉక్రెయిన్ తూర్పు భాగంలో పోరాటం తీవ్రమైంది. రష్యా 2014లో క్రిమియా, డాన్బాస్లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆక్రమించుకున్న 43,000 చదరపు కిలోమీటర్ల (16,600 చదరపు మైళ్ళు) భూభాగానికి మించి ఇప్పుడు తన తన నియంత్రణను విస్తరించిందని వార్తా సంస్థ AFP నివేదించింది. ముఖ్యంగా, డాన్బాస్ ప్రాంతంలో భాగమైన లుగాన్స్క్ లోని పారిశ్రామిక నగరమైన సెవెరోడోనెట్స్క్ లో వీధి పోరాటాలు చెలరేగాయి. నగరంలో సుమారు 80 శాతం ఇప్పుడు రష్యన్ దళాల నియంత్రణలో ఉంది.
ఇదిలా ఉండగా.. లుగాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గీ గైడే ఉక్రేనియన్ దళాలు చివరి వరకు పోరాడుతాయని ప్రతిజ్ఞ చేశాడు. ఐరోపాలోని అతిపెద్ద రసాయన కర్మాగారాల్లో ఒకటైన సెవెరోడోనెట్స్క్ లోని అజోట్ కర్మాగారాన్ని కూడా రష్యన్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. మిథనాల్ నిల్వ చేసిన గోదాముపై వారు దాడి చేసినట్లు సమాచారం. తూర్పు ప్రాంతంలో రష్యా దళాలు పురోగమించకుండా నిరోధించడానికి ఆయుధాలను సరఫరా చేయాలని ఉక్రెయిన్ తన పశ్చిమ మిత్రదేశాలను కోరింది. యుక్రెయిన్ కు హిమార్స్ బహుళ రాకెట్ లాంచర్లను అందిస్తామని అమెరికా మంగళవారం ధృవీకరించింది. రష్యన్ ఫిరంగిదళాల పరిధికి దూరంగా ఉంటూనే ఉక్రేనియన్ దళాలు రష్యన్ లైన్ల వెనుక లోతుగా దాడి చేయడానికి హిమార్స్ అనుమతిస్తుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని పంపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 24వ తేదీన ఉక్రెయిన్, రష్యాకు యుద్దం మొదలైంది. అప్పటి నుంచి రెండు వైపులా రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి. ఇరు వైపుల సైనికులు చనిపోతున్నారు. ఈ యుద్ధం వల్ల కేవలం ఆ రెండు దేశాలకే నష్టం జరగడం లేదు. ప్రపంచంలోని ప్రతీ దేశంపై ఈ యుద్ధం ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడుతోంది. ఈ యుద్ధం ఆపేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వార్ వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటికీ రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు.