Russia Ukraine Crisis: యుద్దం ముగించే ప్రయత్నంలో భాగంగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ జెరూసలేం వేదికగా సమావేశం అవడానికి సిద్దంగా ఉన్ననని, ఈ భేటీకి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ను మధ్యవర్తిగా వ్యవహరించమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం ప్రతిపాదించినట్లు ప్రభుత్వ మీడియా నివేదించింది.
Russia Ukraine Crisis: గత రెండు వారాలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తునే ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలను ఆక్రమించిన రష్యా బలగాలు. ఈ క్రమంలో వందలాది మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. వేలాది మంది సైనికులు పోరాటంలో వీరమరణం పోందారు. లక్షలాది మంది పౌరులు ప్రాణాలను అరి చేతులో పెట్టుకుని.. దేశం విడిచి పారిపోయారు. కోట్ల విలువైన అపూర్వ సంపద ధ్వంసమయ్యింది. ఈ నేపథ్యంలో కీవ్కు చెందిన ఓ మీడియా సంస్థ సంచలన విషయాన్ని బయటపెట్టింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశం కావాలని నిర్ణయించారని, ఈ మేరకు ఓ ప్రతిపాదన కూడా పుతిన్కు పంపినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. జెరూసలేం వేదికగా సమావేశమవుదామని పుతిన్ ముందు జెలెన్స్కీ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ను మధ్యవర్తిగా వ్యవహరించమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరినట్లు మీడియా సంస్థ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి ప్రపంచ దేశాలు యుద్దం ఆపివేయాలని కోరాయి. అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్య సమితి, నాటో, యూరోపియన్ యూనియన్ లు తక్షణమే యుద్దం నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఇప్పటికే రష్యా అనేక దేశాల ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఫోన్లో సంభాషించారు. ఈయనతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్ కూడా ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలనే వీరిద్దరూ పుతిన్కి సూచించారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు.
ఈ ఇద్దరు నేతలు కూడా మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. ఉక్రెయిన్ను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని ఈ ఇద్దరు నేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్కి సూచించారు. తక్షణమే యుద్ధం ఆపాలని, చర్చల ద్వారా ఓ పరిష్కారానికి రావాలని జర్మన్ ఛాన్సలర్, ఫ్రాన్ అధ్యక్షుడు మక్రాన్ పుతిన్కు సూచించారు.
ఇదిలాఉంటే.. రష్యా కొనసాగిస్తున్న దండయాత్రలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించారని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. కనీసం 2.5 మిలియన్ల మంది దేశం విడిచి వెళ్లిపోయారని UN తెలిపింది. రష్యా శనివారం నాడు, కైవ్ ప్రాంతంలోని వాసిల్కివ్లోని ఎయిర్ఫీల్డ్ను రష్యా ధ్వంసం చేసింది, మారియుపోల్లోని 80 మంది పౌరులు ఉన్న మసీదును ధ్వంసం చేసింది.
