Phnom Penh: కంబోడియాలో బర్డ్ ఫ్లూతో 11 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. పలు దేశాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదుకావడమనే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) పేర్కొంది. భారత్ లోనూ ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.
11-year-old dies of bird flu in Cambodia: పలు దేశాల్లో మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. చాలా కాలం తర్వాత కంబోడియాలో బర్డ్ ఫ్లూతో 11 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. కంబోడియాలోని ప్రే వెంగ్ ప్రావిన్స్ కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ తో మృతి చెందిందని సంబంధిత అధికారులు తెలిపారు. 2014 తర్వాత దక్షిణాసియా దేశంలో హెచ్5ఎన్1 వైరస్ సోకిన తొలి కేసు ఇదేనని ఆరోగ్య మంత్రి మామ్ బున్హెంగ్ తెలిపినట్టు 'ది ఇండిపెండెంట్' నివేదించింది. "గ్రామీణ ప్రే వెంగ్ ప్రావిన్స్ కు చెందిన బాలిక తీవ్ర జ్వరం, దగ్గుతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ప్నోమ్ పెన్ లోని జాతీయ బాలల ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని" అధికారు తెలిపారు. బుధవారం ఆమె మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె తండ్రితో పాటు లక్షణాలున్న మరో 11 మందికి కూడా వైరస్ సోకిందని వెల్లడించింది.
ఈ కేసుతో పాటు బాలికతో కాంటాక్ట్ అయిన ఇతర వ్యక్తుల పరీక్షల గురించి ఐరాస ఏజెన్సీ కంబోడియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని డబ్ల్యూహెచ్ వో ఎపిడమిక్ అండ్ పాండమిక్ ప్రిపరేషన్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ సిల్వీ బ్రియాండ్ తెలిపారు. జెనీవాలో జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బ్రియాండ్ మాట్లాడుతూ, ఇది మానవుల నుండి మానవులకు, వైరస్ ఉన్న పరిసరాలను నుంచి సైతం వ్యాప్తిచెందుతుందని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు.
కంబోడియా ఆరోగ్య అధికారులు బాలిక గ్రామానికి సమీపంలో చనిపోయిన పక్షుల నమూనాలను సేకరించారనీ, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులు, పక్షులను నిర్వహించవద్దని ప్రజలను కోరారని ది ఇండిపెండెంట్ నివేదించింది. వైరస్ దృష్ట్యా స్థానికులు ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. యూఎస్ సీడీసీ ప్రకారం, మానవులలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ సంక్రమణ చాలా అరుదైన కేసు, అయితే వైరస్ ఒక వ్యక్తి కళ్ళు, ముక్కు లేదా నోటిలోకి వచ్చినప్పుడు లేదా పీల్చినప్పుడు మానవ అంటువ్యాధులు సంభవిస్తాయి.
పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్ వో
పక్షులు, క్షీరదాల్లో ఇటీవల కేసులు పెరగడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందని రాయిటర్స్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా పక్షుల్లో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడం, మనుషులతో సహా క్షీరదాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హెచ్5ఎన్1 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బ్రియాండ్ తెలిపారు. ఈ వైరస్ ప్రమాదాన్ని డబ్ల్యూహెచ్ వో తీవ్రంగా పరిగణిస్తోందని, అన్ని దేశాల నుంచి అప్రమత్తత పెంచాలని కోరారు.
భారత్ లోనూ బర్డ్ ఫ్లూ కలకలం
భారత్ లోనూ మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ రంగానికి చెందిన వారు క్రియాశీలకంగా మారడంతో పాటు పలు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. రాష్ట్రంలోని బొకారో జిల్లా సెక్టార్ 12లోని లోహంచల్ లో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ బారిన పడి గత ఐదు రోజుల్లో వందలాది కోళ్లు మృతి చెందినట్లు కోల్ కతా ల్యాబ్ ధృవీకరించింది. బొకారో జిల్లాలోని ప్రభుత్వ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
