తాను బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా ఉండి దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తానని భారత సంతతికి చెందిన ఎంపీ రిషి సునక్ అన్నారు. బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో తన అమ్మమ్మ జీవితంలోని కొన్ని విషయాలను పంచుకున్నారు. 

బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) నాయకుడి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కొత్త ప్రధానిని ఎన్నుకునే వ‌ర‌కు ఆయ‌న ఆ ప‌ద‌విలోనే కొన‌సాగనున్నారు. బోరిస్ జాన్సన్ ప్రకటన తర్వాత కొత్త బ్రిటన్ ప్రధానిపై ఎవ‌ర‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈ ప‌ద‌వికి చాలా మంది పోటీలో ఉన్నారు. అయితే ఇదే సమయంలో భార‌త సంతతికి చెందిన రిషి సునక్ పేరు కూడా ఈ రేసులో ముందంజలో ఉంది. ఈ నేప‌థ్యంలో మాజీ ఛాన్సలర్ రిషి సునక్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి కావాలనే తన వాదనను సమర్పించారు. 

Boris Johnson Resign: బోరిస్ జాన్సన్‌ను దెబ్బతీసిన.. సెక్స్ స్కాండల్ సహా 5 కుంభకోణాలు ఇవే

సునక్ ట్విట్టర్‌లో ఒక వీడియోను విడుదల చేస్తూ ‘‘ ఈ సమయంలో ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి నేను కన్జర్వేటివ్ పార్టీకి తదుపరి నాయకుడిని, అలాగే మీ ప్రధానమంత్రిని అవుతాను. విశ్వాసాన్ని పునరుద్ధరిద్దాం, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిద్దాం, దేశాన్ని పునర్నిర్మిద్దాం. ’’ అని ఆ వీడియోలో చెప్పారు. 

అబార్షన్ హక్కును కాపాడుతూ బైడెన్ ఉత్తర్వు.. కోర్టులో పోరాటం మొదలుపెట్టాలని ఆదేశాలు...

ఈ వీడియ‌లో త‌న అమ్మ‌మ్మ క‌థ‌ను కూడా రిషి వివ‌రించారు. ఆయ‌న తాత‌లు పంజాబ్ నుండి ఇంగ్లాండ్ కు వచ్చారు. ‘‘ అమ్మమ్మ యుక్త వయసులో ఉన్న‌ప్పుడు మెరుగైన జీవితం కోసం ఇంగ్లాండ్‌కు విమానం ఎక్కింది. ఆమె (అమ్మమ్మ) ఎలాగోలా ఉద్యోగం సంపాదించగలిగారు, కానీ ఆమె భర్త, పిల్లలను ఇక్క‌డికి తీసుకురావడానికి తగినంత డబ్బును కూడ‌బెట్ట‌డానికి త‌న‌కు దాదాపు ఒక సంవత్సరం పట్టింది. ఆమెకు కుటుంబమే సర్వస్వం ’’ అని అన్నారు. 

Scroll to load tweet…

49 ఏళ్ల రిషి సున‌క్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు NR నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాడు. వారిద్ద‌రూ కాలిఫోర్నియాలో చదువుతున్నప్పుడు కలిశారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కూతుర్లు ఉన్నారు. కాగా బోరిస్ జాన్సన్ ఎన్నికల ప్రచారంలో రిషి సునక్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయ‌న 2015లో తొలిసారి ఎంపీ అయ్యారు. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటకు రావాలన్న బోరిస్ జాన్సన్ విధానానికి ఆయన మద్దతు తెలిపారు. అయితే ఖజానా ఛాన్సలర్‌గా సునక్ రాజీనామా చేసిన తర్వాత బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో కూడా ఒక్కొక్క‌రు రాజీనామాలు చేయ‌డం ప్రారంభించారు దీంతో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే రిషి సున‌క్ బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌డితే.. బ్రిటీష్ ప్రధాని అయిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి గా చ‌రిత్ర సృష్టిస్తాడు.