ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ఆటమ్ బాంబ్ తీసుకెళ్లు.. లోకం నీ కాళ్ల కిందికి వస్తుంది: పాకిస్తాన్ నేత (video)
ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ఆటమ్ బాంబ్ తీసుకుని వెళ్లండి. ఈ లోకం మీ పాదాల చెంతకు రాకుంటే నా పేరు మార్చండి అని పాకిస్తాన్ నేత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభం ముప్పులో ఉన్న పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఇటీవలే పలు దేశాల్లో కొందరు ఆందోళనకారులు ఖురాన్ ప్రతులను కాల్చేశారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అంతర్జాతీయ సంస్థల నుంచి బెయిల్ ఔట్ ప్యాకేజీల కోసం పాకిస్తాన్లోని షెబాజ్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వడానికి కఠిన షరతలు పెట్టింది. ఈ షరతలు అత్యంత కఠినంగా ఉన్నాయని, కానీ, తమకు తప్పడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం అన్నది. అదే సందర్భంలో స్వీడన్, టర్కీ దేశాలు నాటోలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ స్వీడన్లో జరిగిన నిరసనల్లో ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతులను దహనం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇస్లామిస్ట్ లీడర్ సాద్ రిజ్వి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అవి ఒక రకమైన జిహాదీ వ్యాఖ్యలే అని విశ్లేషకులు అంటున్నారు.
లాహోర్లో నిర్వహించిన ఓ ర్యాలీలో సాద్ రిజ్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు మన దేశ ప్రధానమంత్రి (షెబాజ్ షరీఫ్), ఆయన మొత్తం మంత్రివర్గాన్ని, ఆర్మీ స్టాఫ్ చీఫ్ను వేరే దేశాలకు పంపి ఆర్థిక సహాయం కోసం అడుక్కునేలా చేస్తున్నారు.. వారు ఎందుకు ఈ పని చేస్తున్నారని నేను అడుగుతున్నా. దేశం ప్రమాదంలో ఉన్నదని వారు అంటున్నారు. వారిని నా వైపు పిలుచుకుని దానికి బదులు నేనో సలహా ఇస్తా.. ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ఆటమ్ బాంబ్ సూట్కేసును తీసుకుని, మొత్తం క్యాబినెట్ను స్వీడన్కు తీసుకెళ్లండి. మేం ఖురాన్ రక్షణ కోసం వచ్చామని చెప్పండి. ఈ మొత్తం విశ్వం నీ పాదాల కిందకు రాకుంటే, మీరు నా పేరు మార్చండి’ అని సాద్ రిజ్వి అన్నారు. ఈ ర్యాలీకి సుమారు 12 వేల మంది హాజరైనట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది తల తెగిపడింది.. మసీదులో లభ్యం: పాకిస్తాన్ పోలీసులు
వేరే దేశాలతో పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం లేదు. వారిని బెదిరించి మన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చని తన ప్రసంగం ద్వారా సాద్ రిజ్వి పేర్కొన్నారు.
సాద్ రిజ్వి పార్టీ తెహ్రీక్ ఈ లబ్బాయిక్ ను పాకిస్తాన్ లో గతంలో నిషేధించారు. కానీ, 2021లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తేశారు. తమ నాయకుడిని లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలు నుంచి విడుదల చేయాలని, పార్టీ పై నిషేధం ఎత్తేయాలని ఈ పార్టీ నేతలు మాజీ ప్రధాని పై తీవ్ర ఒత్తిడి చేశారు.