ఎయిర్ పోర్టులో పాము.. హడలిపోయిన ప్రయాణికులు
విమానాలు పార్క్ చేసి సర్వీసింగ్ చేసే ప్రాంతంలో పాము కనబడడంతో అక్కడివారు ఒక్కసారిగా హడలెత్తిపోయారు.
ఎయిర్ పోర్టులో పాము కలకలం సృష్టించిన సంఘటన పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో చోటుచేసుకుంది.విమానాలు పార్క్ చేసి సర్వీసింగ్ చేసే ప్రాంతంలో పాము కనబడడంతో అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా హడలెత్తిపోయారు. పాకిస్థాన్లో విమానాశ్రయంలోకి ఇలా పాము ప్రవేశించడం ఇది రెండోసారి.
సిబ్బంది చెబుతున్న దాని ప్రకారం.. విమానాశ్రయ ప్రాంగణంలో తమకు చాలా సార్లు పాములు కనబడ్డాయని, దీని గురించి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. పాము కాటుకు వైద్యం చేసే ఆస్పత్రి దగ్గర్లో ఎక్కడా లేదని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ‘‘ఈ పాము విషపూరితమైనది కాదు. వర్షాకాలం కారణంగా పాములు పొడి ప్రదేశాన్ని వెతుక్కొంటూ వస్తాయి. ఈ క్రమంలోనే విమానాశ్రయంలోకి వచ్చాయి.’’ అని పౌర విమానయాన ప్రాధికార సంస్థ (సీఏఏ) అధికార ప్రతినిధి ఫరా హుస్సేన్ అన్నారు.
ఈ నెల మొదట్లో ఇదే విమానాశ్రయం లాంజ్లో ఐదు వీధి కుక్కలు సంచరిస్తున్న వీడియో అంతర్జాలంలో వైరల్ అయింది. దీంతో వెంటనే ఎయిర్పోర్టు మేనేజర్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు పాకిస్థాన్కు చెందిన ఓ వార్తా సంస్థ తెలిపింది.