విహారం .. విషాదం.. చిన్నారులతో సహా 21 మంది మృతి
Pakisthan: పాకిస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. మంచు అందాలను చూడటానికి వెళ్లిన 21మంది దుర్మరణం చెందారు. మనుషుల ప్రాణాల్ని బలిగొన్న విషాద ఘటన పాకిస్థాన్ లోని ముర్రీ పట్టణంలో చోటుచేసుకుంది.
21 freeze to death : విహారంలో విషాదం చోటు చేసుకుంది. కొండప్రాంతాల్లో మంచు కురువడాన్ని, ఆ చల్లని వాతావరణాన్ని ఆస్వాదించేందుకు విహార యాత్రకు వెళ్లారు. కానీ అక్కడ జరిగిన ఆకస్మిక ఘటన విహార యాత్రలో విషాదాన్ని మిగిల్చింది. ఆ యాత్రికులను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. చలికి తట్టుకోలేక, వాహనాల్లోనే ఇరుక్కుని ఏకంగా 21 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్ లోని ముర్రీ పట్టణంలో చోటుచేసుకుంది.
ముర్రీ పట్టణంలో హిల్ స్టేషన్ లో కురుస్తోన్న మంచును, అక్కడ ప్రకృతి అందాల్ని చూడ్డానికి వందలాది మంది పర్యాటకులు ఆ ప్రాంతానికి తరలి వెళ్లారు. అయితే.. అక్కడ అనుకోకుండా భారీ మంచు వర్షం కురిసింది. దీంతో రోడ్లపై తీవ్రంగా మంచు కురవడంతో మంచులో కొన్ని కార్లు చిక్కుకుపోయాయి. ముందుకు గానీ వెనక్కి గాని కదలటానికి వీల్లేకుండా నిలిచిపోయాయి. ఆ హిమపాతానికి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి కార్లు కదలకుండా నిలిచిపోయాయి.
ఆ కార్లలో ఉన్న 21మంది చలి తీవ్రత తట్టుకోలేక చనిపోయారు. మృతుల్లో 9 మంది పిల్లలు ఉన్నారని సమాచారం. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని విపత్తు కలిగిన ప్రదేశంగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఇస్లామాబాద్, రావల్పిండి అధికారులు రెస్క్యూ ఆరేషన్ కొనసాగిస్తున్నారు. రావల్పిండి జిల్లాలోని ముర్రేలో వేలాది వాహనాలు నగరంలోకి ప్రవేశించడంతో అన్ని మార్గాలను బ్లాక్ చేశారు,
ఈ ఘటనపై పంజాబ్ మంత్రి ఉస్మాన్ బుజ్దార్ స్పందించారు. రెస్క్యూ పనిని వేగవంతం చేయాలని , ఒంటరిగా ఉన్న పర్యాటకులకు సహాయం అందించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. ఆసుపత్రులు, పోలీసు స్టేషన్లు, పరిపాలనా కార్యాలయాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
రోడ్లను క్లియర్ చేయడానికి మరియు ఇంకా చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సైన్యాన్ని సమీకరించినట్లు మంత్రి షేక్ రషీద్ తెలిపారు. ఒక్కరాత్రిలోనే ముర్రీ ప్రాంతాన్ని 4 అడుగుల మేర మంచుదుప్పటి కప్పేసిందని చెప్పారు మంత్రి. ఈ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు అధికారులు. ఇంకా వాహనాల్లో ఇరుక్కున్న మరికొంతమందికి ఆహారం, దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.