ఇమ్రాన్ ఖాన్ని ఐఎస్ఐ చంపేసిందని సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై పాక్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇమ్రాన్ మరణించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీలో చనిపోయారన్న ప్రచారం అవాస్తవమని పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ మరణ వార్త ఫేక్ అని, ప్రజలు తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని పాక్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వచ్చిన వార్తలపై పాకిస్తాన్ దర్యాప్తు మొదలుపెట్టింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని చెబుతూ శనివారం పాక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ప్రకటనలో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని పేర్కొన్నారు. ఈ వార్తలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ని చంపేసిందంటూ చాలా ఎక్స్ పోస్టులు కూడా వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ జైల్లో లైంగిక వేధింపులకు గురయ్యారంటూ ఇటీవల మరో ఫేక్ ప్రచారం కూడా పాక్ సోషల్ మీడియాలో జరిగిన విషయం తెలిసిందే.
పాక్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ ఆయన పార్టీ శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీర్ఘకాలం జైల్లో ఉండటం వల్ల ఇమ్రాన్ ఆరోగ్యం దెబ్బతిందని, ఇండియాతో సరిహద్దు సమస్య కారణంగా ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని పార్టీ కోర్టుకు తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ఉన్న అడియాల జైలుపై డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందని పిటిఐ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ ఆయన అనుచరులు లాహోర్లో నిరసన తెలిపారు.
పాకిస్తాన్ 19వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ వరకు పనిచేశారు. తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా. 2025 జనవరిలో అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అల్ ఖాదిర్ ట్రస్ట్ భూమి కేసులో పాకిస్తాన్ అవినీతి నిరోధక కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో ఇమ్రాన్తో పాటు నిందితురాలైన ఆయన భార్య బుష్రా బీబీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తోషఖానా అవినీతి కేసులో అరెస్టయి జైల్లో ఉన్నప్పుడే ఇమ్రాన్ ఖాన్కు మరో అవినీతి కేసులో జైలు శిక్ష పడింది.