గోధుమ పిండి కోసం ప్రాణాలు పణంగా పెట్టి ట్రక్కును చేజ్ చేసిన ప్రజలు.. ‘15 కిలోల పిండికి రూ. 2050’ (వీడియో)
పాకిస్తాన్లో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. గోధుమ పిండి కోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. గోధుమ పిండి కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఓ ట్రక్కును చేజ్ చేస్తున్న ప్రజల వీడియో అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఆహార సంక్షోభ తీవ్రతను తెలిపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ దేశ ప్రజలు ఎక్కువగా ఆధారపడే గోధుమ పిండి లభించట్లేదు. గోధుమ పిండి లభ్యత కొరవడింది. దీంతో ప్రజలు గోధుమ పిండి ఎక్కడ కనిపించినా ఎగబడుతున్నారు. గోధుమ పిండి లోడ్తో ఓ ట్రక్కు వెళ్లుతున్నదని గ్రహించిన ప్రజలు ఆ లారీని వెంబడించారు. కొందరైతే ప్రాణాలు పణంగా పెట్టి దానికి వేలాడుతూ వెళ్లారు. మిగితా వారు ద్విచక్ర వాహనాలపై చేజ్ చేశారు. అలా చేజ్ చేస్తూనే ట్రక్కులో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి పిండి ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. డబ్బులు ఇచ్చి రిక్వెస్ట్ చేసుకుంటూ గోధుమ పిండి ప్యాకెట్లు తీసుకెళ్లారు.
ఈ వీడియోను నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్ము కశ్మీర్ గిల్గిత్ బాల్టిస్తాన్ అండ్ లడాఖ్ చైర్మన్, ప్రొఫెసర్ సాజద్ రాజా ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఇది మోటార్ సైకిల్ ర్యాలీ కాదు, కానీ, పిండి ట్రక్కును వెంబడిస్తు్న పాకిస్తాన్ ప్రజల వీడియో. ఒక గోధుమ పిండి ప్యాకెట్ కొనుగోలు చేయాలని ఆశపడుతూ చేజ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో మంచి భవిష్యత్ ఉంటుందని అనుకోవచ్చా? పాకిస్తాన్లో ఏం జరుగుతున్నదో తెలిపే ఓ వీడియో ఇది’ అని వివరించారు.
పాకిస్తాన్లో ఆహార సంక్షోభం ముదిరింది. గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు 15 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ ధర రూ. 2,050గా ఉన్నది. ఇటీవలే దీన ధర రూ. 150 పెరిగింది.కేవలం రెండు వారాల్లోనే రూ 300లు పెరిగింది.