పాకిస్థాన్ వరదలు: సింధు నది ఉప్పెన భయంతో పాకిస్థాన్ దక్షిణ ప్రాంతాలు హై అలర్ట్లో ఉన్నాయి. ఉత్తర వరదల నుండి దిగువకు వచ్చే నీరు రాబోయే కొద్ది రోజుల్లో దక్షిణ ప్రావిన్స్లోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు.
పాకిస్థాన్ వరదలు: పాకిస్థాన్ లో వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రికార్డు స్థాయిలో రుతుపవనాల వర్షాల తర్వాత దేశంలోని మూడో వంతు ఇప్పటికీ ముంపునకు గురికావడంతో పాకిస్థాన్లోని దక్షిణ ప్రావిన్స్లు మరిన్ని వరదలకు గురవుతున్నాయి. దాదాపు 1,200 మంది వరదల కారణంగా చనిపోయారు. ఇందులో 399 మంది పిల్లలు ఉన్నారు. అనేక మంది గల్లంతు అయ్యారు. ఒక దశాబ్దంలో అత్యంత ఘోరమైన వర్ష సంబంధిత విపత్తుగా పిలవబడే ప్రమాదంలో పాకిస్థాన్ ప్రస్తుతం పోరాడుతోంది. అయితే, ఉత్తరప్రాంతంలో సంభవించిన వరదలు ప్రభావం ఇప్పుడు దక్షిణ ప్రాంతాలపై కొద్ది రోజులు ఉండనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే వాగులు వంకలు, నదులు పొంగి పొర్లుతుండటంతో ఆయా ప్రాంతాలు అప్రమత్తంగా ఉన్నాయి.
"ఉత్తర వరదల నుండి దిగువకు వచ్చే నీరు రాబోయే కొద్ది రోజుల్లో ప్రావిన్స్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున మేము చాలా అప్రమత్తంగా ఉన్నాము" అని సింధ్ ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తాజా వహాబ్ వార్తా సంస్థ రాయిటర్స్తో అన్నారు. సింధు నది సెకనుకు దాదాపు 600,000 క్యూబిక్ అడుగుల చొప్పున ఉప్పొంగుతుందని, ఇప్పటికే ఉన్న వరద రక్షణను పరీక్షకు గురిచేస్తుందని వహాబ్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి పాకిస్థాన్ లో పరిస్థితిని దారుణమైన వాతావరణ విపత్తు అని పేర్కొంది. విధ్వంసానికి గురైన దేశాన్ని ఆదుకోవడానికి 160 మిలియన్ డాలర్ల సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. వరదల నేపథ్యంలో పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ విపత్తు ఈ నెలలో ద్రవ్యోల్బణం తాజా రికార్డును తాకడంతో ఆర్థిక సమస్యలకు దారితీసింది. ఇది 47 సంవత్సరాలలో అత్యధికం. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వినియోగదారుల ధరలు గత నెలలో 27.26 శాతం పెరిగాయి.
వరదలు నాలుగు మిలియన్ల మంది పాకిస్థానీలను ప్రభావితం చేశాయి. వారి జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఆహారం, పోషకాహారం-జీవనోపాధి సహాయంతో రాబోయే నెలల్లో ఒక మిలియన్ మందికి చేరువవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం ముందుగా తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 6.4 మిలియన్లకు పైగా మానవతా సహాయం అవసరం అని తెలిపింది. చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి సహాయం పొందడం ప్రారంభించింది. అయితే ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారతదేశ సహాయాన్ని అంగీకరించే అవకాశాన్ని తోసిపుచ్చారు.
చరిత్రలో అత్యంత తీవ్రమైన వరదల కారణంగా పాకిస్థాన్ లో మూడు మిలియన్లకు పైగా పిల్లలకు మానవతా సహాయం అవసరమనీ, నీటి ద్వారా వచ్చే వ్యాధులు-పోషకాహారలోపానికి గురయ్యే ప్రమాదం ఉందని యునిసెఫ్ తెలిపింది. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ఒక ప్రకటనలో ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లలు-కుటుంబాల అత్యవసర అవసరాలకు ప్రతిస్పందించడానికి ప్రభుత్వం-ప్రభుత్వేతర భాగస్వాములతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాల కారణంగా పాకిస్థాన్ లో 33 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారనీ, అందులో 16 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారనీ తెలిపింది.
