ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే వుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా యుద్ధంలో విజయం సాధించాలని రష్యా అధినేత పుతిన్ గట్టి పట్టుదలగా వున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌కు అంతర్జాతీయంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు భారీగా నిధులు అందుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సంతతికి చెందిన బిలియనీర్ మహ్మద్ జహూర్ ఉక్రెయిన్ సైన్యం కోసం రెండు యుద్ధ విమానాలను కొనుగోలు చేశారు. 

పాకిస్తాన్‌కు చెందిన బిలియనీర్, కైవ్ పోస్ట్ మాజీ పబ్లిషర్ మహ్మద్ జహూర్ (Pakistan Billionaire Mohammad Zahoor) ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర (russia ukraine war) నేపథ్యంలో ఆ దేశానికి అండగా నిలిచారు. దీనిలో భాగంగా యుద్ధంలో సహాయం చేసేందుకు గాను ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు సమకూర్చినట్లు కథనాలు వస్తున్నాయి. 

న్యూస్ వీక్ నివేదిక ప్రకారం... జహూర్ భార్య, ఉక్రేనియర్ గాయని కమాలియా జహూర్ (Kamaliya Zahoor) తన భర్త సహా ఆయన సంపన్నులైన స్నేహితులు రష్యాతో పోరాటంలో భాగంగా ఉక్రెయిన్‌కు గుట్టుగా సాయం చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ వైమానిక దళం కోసం రెండు ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసినట్లు కమాలియా తెలిపారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు తన భర్త అనుమతి ఇచ్చారని.. ఎందుకంటే యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న విషయాన్ని వారు గోప్యంగా వుంచారని ఆమె పేర్కొన్నారు. 

Also Read:రష్యాకు లొంగిపోయిన ఉక్రెయిన్ జవాన్లు.. బంధీలను బదిలీ చేసుకుంటారా? హతమారుస్తారా?

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రేనియన్ వార్తాపత్రిక కైవ్ పోస్ట్‌కు మాజీ యజమాని అయిన జహూర్.. స్ధానికుల్ని సురక్షితంగా తరలించేందుకు కృషి చేస్తున్నారు. పాకిస్తాన్ మూలాలున్న బ్రిటీష్ జాతీయుడైన జహూర్ ఇందుకోసం భారీగా నిధులను సమీకరిస్తున్నారు. యూకే సహా ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు శరణార్థులను తరలించడంలో సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు న్యూస్ వీక్ తన కథనంలో పేర్కొంది. ఉక్రేనియన్ల ప్రయాణం సాఫీగా సాగేందుకు వివిధ దేశాధినేతలు, ఇతర పలుకుబడి వున్న వ్యక్తులతో సమావేశమవుతున్నారు. మార్చిలో అరబ్ న్యూస్ వార్తాసంస్థతో మాట్లాడిన జహూర్ రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతోన్న ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఉక్రెయిన్‌ పక్షం వహిస్తున్నానని జహూర్ బహిరంగంగా ప్రకటించారు. ఉక్రెయిన్ కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు. 

రాయిటర్స్ కథనం ప్రకారం.. రష్యా, రష్యా- మద్ధతు గల దళాలు ఇప్పటికీ ఉక్రెయిన్‌లో అజోవ్ సముద్రం, నల్ల సముద్రం వెంబడి వున్న తూర్పు సరిహద్దులో మోహరించి వున్నాయి. అయితే గడిచిన రెండు వారాల్లో ఈశాన్య ఉక్రేనియన్ నగరమైన ఖార్కివ్ పరిసరాల్లో వున్న రష్యా దళాలను ఉక్రెయిన్ దళాలు తరిమివేశాయి. కాగా.. కీలక పోర్టు నగరం మరియుపోల్‌‌ కోసం ఉక్రెయిన్ తీవ్రంగా కొట్లాడింది. ఇక్కడ ఉక్రెయిన్ జవాన్లు సరెండర్ కావడంతో రష్యా దీన్ని కీలక విజయంగా ప్రకటించింది. సోమవారం రాత్రి మరియుపోల్ లోని స్టీల్ వర్క్స్ ఫ్యాక్టరీ నుంచి ఉక్రెయిన్ జవాన్లతో బస్సులు రష్యాలోకి బయల్దేరి పోయాయి. ఐదు బస్సులు రష్యా అధీనంలోని నోవోజావ్స్క్‌కు వెళ్లాయి. అక్కడ గాయపడ్డ ఉక్రెయిన్ పౌరులకు చికిత్స అందిస్తామని రష్యా ప్రభుత్వం తెలిపింది.

ఇకపోతే.. ఏడు బస్సుల్లో ఉక్రెయిన్ ఫైటర్లను రష్యా నియంత్రణలోని దొనెత్స్క్ రీజియన్ సమీపంలోని ఒలెనివ్కాలో కొత్తగా రీఓపెన్ చేసిన జైలుకు తరలించారు. 256 మంది ఉక్రెయిన్ జవాన్లను తమ అధీనంలోకి తీసుకున్నామని రష్యా వెల్లడించింది. వీరంతా తమ ఆయుధాలు వదిలి లొంగిపోయారని తెలిపింది. ఇందులో 51 మంది తీవ్రంగా గాయపడ్డవారు ఉన్నారని పేర్కొంది. కాగా, ఉక్రెయిన్ మాత్రం రష్యాకు లొంగిపోయినవారి సంఖ్య మరింత ఎక్కువగా చెప్పింది. 264 మంది జవాన్లు రష్యాకు లొంగిపోయారని వివరించింది.