నోబెల్ ప్రైజ్ 2022: రసాయన శాస్త్రంలో ముగ్గురికి పురస్కారం.. బ్యారీ షార్ప్లెస్ను రెండోసారి వరించిన అవార్డు..
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నేడు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది.
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నేడు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. రసాయన శాస్త్రంలో మరింత క్రియాత్మక రూపానికి పునాది వేసిన యుఎస్, డెన్మార్క్లకు చెందిన ముగ్గురు రసాయన శాస్త్రవేత్తలకు బుధవారం నోబెల్ కెమిస్ట్రీ బహుమతిని ప్రకటించారు. అమెరికా చెందిన కరోలిన్ బెర్టోజీ, బ్యారీ షార్ప్లెస్, డెన్మార్క్కు చెందిన మోర్టెన్ మెల్డాల్లు.. ‘‘క్లిక్ కెమిస్ట్రీ అండ్ బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం’’నోబుల్ అవార్డుతో గౌరవించబడ్డారు అని జ్యూరి పేర్కొంది.
ఈ ముగ్గురు విజేతలు 10 మిలియన్ స్వీడిష్ క్రోనా (£800,000) ప్రైజ్ మనీని పంచుకోనున్నారు. అయితే 81 ఏళ్ల బ్యారీ షార్ప్లెస్ నోబెల్ అవార్డు రావడం ఇది రెండోసారి. దీంతో ఆయన రెండు నోబెల్ బహుమతులు పొందిన ఐదవ వ్యక్తిగా నిలిచారు. బ్యారీ షార్ప్లెస్.. 2001లో కూడా రసాయన శాస్త్రంలో నోబెల్ను గెలుచుకున్నారు. ఇక, గతేడాది.. అణువుల నిర్మాణానికి సంబంధించిన సాధనాలను రూపొందించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు వరించింది.
ఈ ఏడాది నోబెల్ పురస్కారాల విషయానికి వస్తే.. సోమవారం వైద్య శాస్త్రంలో, మంగళవారం భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటించారు. నేడు రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతను ప్రకటించారు. గురువారం సాహిత్య రంగంలో నోబెల్ విజేత పేరు ప్రకటిస్తారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను శుక్రవారం ప్రకటించనున్నారు. అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ విజేతను వెల్లడించనున్నారు.
1895 నాటి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం.. నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు. 1901 నుంచి సైన్స్, సాహిత్యం, శాంతికి సంబంధించి అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఇక, 1968 నుంచి ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇస్తున్నారు.