మయన్మార్ సముద్ర తీరంలో  జరిగిన పడవ ప్రమాదాల్లో 427 మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.

మయన్మార్ తూర్పు సముద్ర తీరంలో ఇటీవల చోటు చేసుకున్న రెండు పడవ ప్రమాదాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ (UNHCR) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘోర ఘటనల్లో మొత్తం 427 మంది రోహింగ్యా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 9న తొలి ప్రమాదం సంభవించింది. మొత్తం 267 మంది రోహింగ్యా ముస్లింలు ప్రయాణిస్తున్న బోట్ ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. ఇందులో 201 మంది మరణించినట్లు సమాచారం. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరొక పడవ ప్రమాదానికి గురైంది. ఆ పడవలో 247 మంది ఉండగా, దాదాపు 226 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రయాణాల్లో ఉన్నవారంతా మయన్మార్, బంగ్లాదేశ్‌ శరణార్థ శిబిరాల నుంచి వలసకు బయలుదేరినట్లు గుర్తించారు. వీరంతా ముఖ్యంగా మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రం నుంచి వచ్చారు. అక్కడ మతపరమైన హింస, వివక్షకు గురవుతూ, వేరే ప్రదేశాలకు తరలిపోవడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, వర్షాకాలం ప్రారంభమవుతుండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలాంటి సమయంలో చిన్న పడవలలో వందలాది మైళ్ల ప్రయాణించడం తీవ్రమైన ప్రమాదం. ఈ విషయాన్ని UNHCR స్పష్టంగా హెచ్చరించింది.ఈ రెండు ప్రమాదాల తర్వాత సముద్ర మార్గంలో వలసకు పోయే యత్నాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని, దీనిపై అంతర్జాతీయ సమాజం అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

UNHCR తాజా గణాంకాల ప్రకారం, సమీప దేశాలకు చేరే ప్రయత్నంలో ప్రతి సంవత్సరం వందలాది మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం అసురక్షిత మార్గాలు, శోషణ, సముద్ర ప్రమాదాలే.ఈ దుర్ఘటనలు మరోసారి రోహింగ్యాల పరిస్థితిని అంతర్జాతీయ దృష్టికి తీసుకువచ్చాయి.