కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అనే త్రీ సీ లు భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను ప్రభావితం చేస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సిడ్నీలో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
భారత్ ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని.. అవి కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంగళవారం సిడ్నీలో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ - ఆస్ట్రేలియాను కలిపి వుంచే మరో బంధం యోగా అన్నారు . ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని మోడీ చెప్పారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలబడిందని ఆయన గుర్తుచేశారు. భారత్- ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని ప్రధాని తెలిపారు. ఒక్క క్లిక్తో డీబీటీ సాధ్యమైందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగిందని.. బ్రిస్బేన్లో త్వరలోనే భారత కాన్సులేట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద వున్న భారత్ స్పందిస్తోందని.. అందుకే ప్రస్తుతం భారత్ను విశ్వగురు అంటున్నారని మోడీ పేర్కొన్నారు. వలసల ఒప్పందం వల్ల ఇరుదేశాల విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. కరోనా సమయంలో భారత్లో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని మోడీ గుర్తుచేశారు. తనతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
వసుదైక కుటుంబం అన్నదే భారత్ నినాదమన్నారు. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన వారధి అని మోడీ పేర్కొన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు. ఆస్ట్రేలియా వాసులు సహృదయులు, విశాల హృదయులన్నారు. భారతీయ భాషలన్నీ ఆస్ట్రేలియాలో ప్రముఖంగా వినిపిస్తాయని మోడీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలు భారతీయులకు ప్రత్యేకమైనవని మోడీ తెలిపారు. ప్రముఖ భారతీయ వంటకాలన్నీ ఆస్ట్రేలియాలో లభిస్తాయని ప్రధాని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధానికి ఇక్కడి జైపూర్ జిలేబీలను రుచి చూపిస్తానని మోడీ తెలిపారు. సిడ్నీలో లక్నో పేరుతో ఓ ప్రత్యేక ప్రాంతం వుందన్నారు. సిడ్నీ ఓపెరా హౌస్పై భారత జెండా కనిపించడం సంతోషంగా వుందని మోడీ అన్నారు.
ఆస్ట్రేలియా తరహాలో భారత్ కూడా త్వరలోనే అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. మొబైల్ వినియోగం, ఫిన్ టెక్ రంగంలో, పాల ఉత్పత్తిలో భారత్ నెంబర్వన్గా వుందన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ది రెండో స్థానమని మోడీ చెప్పారు. అనేక దేశాలు ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నాయని.. కానీ భారత ఆర్ధిక వ్యవస్థ మాత్రం స్థిరంగా వృద్ధి సాధిస్తోందని మోడీ తెలిపారు. భారత అన్ని దేశాలకు ఆశాదీపమని ప్రపంచబ్యాంక్ చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. తాను మళ్లీ వస్తానని ఇక్కడి ప్రవాస భారతీయులకు 2014లోనే మాట ఇచ్చానని మోడీ తెలిపారు. మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చి .. నా వాగ్ధానాన్ని నెరవేర్చుకున్నానని మోడీ పేర్కొన్నారు.
