సజీవంగానే బ్యాగ్లో పెట్టి పోస్టుమార్టం గదికి బాడీ తరలింపు.. లేవడానికి ప్రయత్నం!.. ఆ వైద్యుడు ఏం చెప్పాడంటే?
ఆస్ట్రేలియాలోని ఓ హాస్పిటల్లో పేషెంట్ను బతికి ఉండగానే పోస్టుమార్టం గదికి తరలించినట్టు తెలిసింది. ఆ తర్వాత బ్యాగ్ నుంచి బయట పడటానికి పేషెంట్ ప్రయత్నించినట్టు మరణాన్ని ధ్రువీకరించడానికి వచ్చిన వైద్యుడు వివరించాడు.
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. పెల్లియేటివ్ కేర్లో చేర్చారు. కొంతకాలం అందులో ఉంచిన తర్వాత ఆ వ్యక్తి మరణించినట్టు వైద్యులు భావించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా మరణించినట్టు తెలిపారు. తర్వాత ఆ పేషెంట్ను భద్రంగా ఓ బ్యాగ్లో పెట్టి పోస్టుమార్టం గదికి తరలించారు. మరుసటి రోజు ఆయన మరణాన్ని ధ్రువీకరించడానికి వెళ్లిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. అసలు ఆ వ్యక్తి బతికి ఉన్నప్పుడే పోస్టుమార్టం గదికి తరలించారని తెలిపారు. ఆ తర్వాత బ్యాగ్ నుంచి బయటకు రావడానికి పేషెంట్ ప్రయత్నించినట్టు కూడా సంకేతాలు ఉన్నాయని వివరించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని రాకింగ్హామ్ హాస్పిటల్లో చోటుచేసుకుంది.
సెప్టెంబర్ 5వ తేదీన పేషెంట్ కెవిన్ రీడ్ మరణించినట్టు హాస్పిటల్ సిబ్బంది భావించారు. అదే విషయాన్ని ఆ కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ, డెత్ సర్టిఫికేట్ వెంటనే ఇష్యూ చేయలేదు. తర్వాతి రోజు మాత్రమే ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. అయితే, ఆ మరణాన్ని ధ్రవీకరించడానికి వచ్చినప్పుడు డెడ్ బాడీలో పలు మార్పులు ఉన్నాయని వైద్యులు వివరించారు.
కెవిన్ రీడ్కు క్లీన్ గౌన్ తొడిగించి రెస్టింగ్ పొజిషన్లో పోస్టుమార్టంలో ఉంచారు. ఆయన కళ్లు మూసేశారు. కానీ, వైద్యులు ఇందుకు భిన్నమైన సంజ్ఞలు చూశారు. ఆ గౌన్కు రక్తపు మరకలు ఉన్నాయని, ఆ బాడీ కూడా వేరే ఆకారంలో పడి ఉన్నదని వివరించారు. బ్యాగ్ జిప్ కూడా తొలగించి ఉన్నదని, ఆయన కళ్లు తెరిసి ఉన్నాయని తెలిపారు.
చేతికి గాయమైన చోటి నుంచి రక్తం కారినట్టు ఉన్నదని, పోస్టుమార్టం గదికి వచ్చినప్పటికి భిన్నంగా ఆయన కంటి చూపులు ఉన్నాయని వివరించారు.
సెప్టెంబర్ 6వ తేదీన మరణధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. కానీ, డేట్ మాత్రం 5వ తేదీ అని పేర్కొన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ వైద్యుడు హాస్పిటల్ వదిలిపెట్టాడని, ప్రస్తుతం ఆ హాస్పిటల్ ఈ ఘటనను మరుగున పర్చడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.
ఈ ఘటనపై కొరొనార్ కోర్టు దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు గురించి ఎలాంటి సమాచారాన్ని కోర్టు బహిర్గతం చేయలేదు.