అమెరికాలో  5 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన బాలిక మరణానికి కారణమైన 35 ఏళ్ల వ్యక్తికి 100 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది.

భారత సంతతికి చెందిన ఓ ఐదేళ్ల బాలికను హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు దిమ్మతిరిగే తీర్పును వెలువరించింది. నిందితుడికి ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన గొడవలో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఓ హోటల్ రూమ్‌లో ఆడుకుంటోన్న చిన్నారి తలకు బుల్లెట్ తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బుల్లెట్ కారణంగా బాలిక మరణించింది, దానిపై కోర్టు ఇప్పుడు దోషికి 100 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విషయం ఏమిటి?

భారత సంతతికి చెందిన బాలికను హత్య చేసిన కేసులో దోషిగా జోసెఫ్ లీ స్మిత్, మృతి చెందిన వ్యక్తిగా ఐదేళ్ల చిన్నారి మాయా పటేల్ గా గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో చిన్నారి మాయా పటేల్ హోటల్ గదిలో ఆడుకుంటున్నారని, ఆ సమయంలో ఆమె తలకు బుల్లెట్ తగిలింది. బుల్లెట్‌తో గాయపడిన బాలికను ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ మాయ మూడు రోజుల పాటు ప్రాణాపాయంతో పోరాడి 23 మార్చి 2021న మరణించింది.

నిజానికి, హోటల్ సూపర్ 8 మోటెల్ పార్కింగ్ స్థలంలో, నిందితుడు జోసెఫ్ లీ స్మిత్ మరొక వ్యక్తితో గొడవ పడ్డాడు. ఈ గొడవలో స్మిత్ పేల్చిన బుల్లెట్ తనతో గొడవ పడిన వ్యక్తికి తగలకుండా పక్కనే ఉన్న గదిలో ఆడుకుంటున్న మాయ తలకు తగిలింది. మాయ తల్లిదండ్రులు విమల్ , స్నేహల్ పటేల్ ఈ హోటల్ యజమానులని, వారి కుటుంబం మోటెల్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్నారు. 

ఈ కేసును విచారించిన అక్కడి జిల్లా న్యాయస్థానం , చిన్నారి మృతికి కారణమైన స్మిత్‌కు 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు విచారణను అడ్డుకున్నందుకు 20 ఏళ్లు, తీవ్ర నేరాలు పునరావృతం చేస్తున్నందుకు మరో 20 ఏళ్లు, మొత్తం 100 ఏళ్లు జైల్లోనే గడపాలని ఆదేశించింది. పెరోల్ లేదా శిక్షలో తగ్గింపు వంటి ఎటువంటి అవకాశాలు లేకుండా శిక్ష అమలు చేయాలని తీర్పు వెలువరించింది. ఈ విధంగా స్మిత్‌కు మొత్తం 100 ఏళ్ల శిక్ష పడింది.