సారాంశం

అమెరికా మరోసారి కాల్పుల కలకలం చేలారేగింది. ఓ దుండగుడు  తన పక్కింట్లో దూరి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8 ఏళ్ల చిన్నారితోపాటు ఐదుగురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది.

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చేలారేగింది. టెక్సాస్‌లో ఓ దుండగుడు ఐదుగురిని కాల్చి చంపాడు.  మీడియా నివేదికల ప్రకారం.. చనిపోయిన వారిలో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ దుండగుడు   తన పక్కింట్లో దూరి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. పక్కింటి వారు శబ్దం చెయ్యొద్దు అన్నందుకు.. ఆగ్రహించిన దుండగుడు ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఐదుగురిని కాల్చిచంపాడు. 

సాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ గ్రెగ్ కేపర్స్ మాట్లాడుతూ.. సాయుధుడు తన యార్డ్‌లో రైఫిల్‌తో కాల్పులు జరిపాడని తెలిపారు. సాయుధుడు పొరుగువారిపై కాల్పులు జరిపాడని కేపర్స్ చెప్పారు. ఘటన సమయంలో సాయుధుడు మద్యం తాగి ఉన్నాడని తెలిపారు. నిందితుడు తన రైఫిల్‌తో వస్తున్న బాధితుల ఇంటిలోని సీసీటీవీ కెమెరాలో చిక్కుకున్నట్లు అధికారి తెలిపారు. అమెరికాలో కాల్పుల ఘటనలు సర్వసాధారణమైపోయాయి. గన్ వయలెన్స్ ఆర్కైవ్ ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 174 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి.

నలుగురిని చంపినందుకు 240 ఏళ్ల జైలు శిక్ష

మరోవైపు అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో నలుగురిని కాల్చి చంపిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 240 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫిబ్రవరి 2020లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు యువకులు - మార్సెల్ విల్స్ (20), బ్రాక్స్టన్ ఫోర్డ్ (21), జాలెన్ రాబర్ట్స్ , ఒక యువతి కిమారీ హంట్ (21) మరణించారు.