కరాచీలోని పాకిస్తాన్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనకు ఓ మహిళా ఉగ్రవాది కారణమని పోలీసులు తేల్చారు. ఆమె తనను పేల్చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.   

కరాచీలోని పాకిస్తాన్‌ యూనివర్సిటీలో (Karachi University Blast) మంగళవారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా.. పలువురికి గాయాలయ్యాయి. కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషయస్‌ ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలోని వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఘటన అనంతరం రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పేలుడు సమయంలో వ్యాన్‌లో ఏడు నుంచి ఎనిమిది వరకు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దారుణానికి కారణం ఒక ఆత్మహుతి దళ సభ్యురాలని తేలింది. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ విజువల్స్‌ను గమనిస్తే.. చైనా నిర్మించిన కన్ఫ్యూషయస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (Confucius Institute) గేటు వద్ద ఓ వ్యాన్ లోపలికి వస్తుండగా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకుంది. ఈ వర్సిటీలో స్థానిక విద్యార్ధులకు చైనీస్ బాషను బోధిస్తారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి (Baloch Liberation Army) చెందిన మజీద్ బ్రిగేడ్ (Majeed Brigade) ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రకటన జారీ చేసింది. అంతేకాదు సదరు సూసైడ్ బాంబర్ ఫోటోను కూడా బీఎల్ఏ షేర్ చేసింది. ఆమె పేరు షరీ బలోచ్‌గా తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు చైనా  జాతీయులు వున్నారని యూనివర్సిటీ అధికార ప్రతినిధి చెప్పారు. వీరిని హువాంగ్ గైపింగ్, డింగ్ ముపెంగ్, చెన్ సా‌‌గా తెలిపారు. ఉగ్రదాడిపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవడంలో కేంద్రం పూర్తి సహాయ సహకారాల్ని అందిస్తుందని సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షాకు హామీ ఇచ్చారు.

కాగా.. పాకిస్తాన్‌లోని (pakistan) అతిపెద్ద నగరం, ఆర్ధిక రాజధానిగా వున్న కరాచీలో చైనా జాతీయులు తీవ్రవాద దాడులకు గురికావడం ఇదే తొలిసారి కాదు. గతేడాడి జూలైలో.. కరాచీలోని ఓ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇద్దరు చైనా జాతీయులను తీసుకు వెళ్తున్న వాహనంపై మోటార్ సైకిల్‌పై ముసుగులు ధరించి వచ్చిన సాయుధులు కాల్పులు జరిపారు. అదే నెలలో వాయువ్య పాకిస్తాన్‌లోని డ్యామ్ ప్రాజెక్ట్ సమీపంలో నిర్మాణ కార్మికులను తీసుకెళ్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో దాదాపు డజను మంది చైనీస్ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. 

నవంబర్ 2018లో బలూచ్ వేర్పాటువాద తీవ్రవాదులు కరాచీలోని చైనా కాన్సులేట్‌పై దాడి చేశారు. అయితే భద్రతా వలయాన్ని ఛేదించే క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. సీఈపీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక ప్రాజెక్ట్‌లలో వేలాది మంది చైనా సిబ్బంది పాకిస్తాన్‌లో పనిచేస్తున్నారు. 


 

Scroll to load tweet…