జపాన్ తూర్పు తీరంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. ఇజు చైన్‌లోని వెలుపలి ద్వీపాల్లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో.. జపాన్ వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే సునామీ హెచ్చరికను జారీ చేసింది. 

జపాన్ తూర్పు తీరంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. ఇజు చైన్‌లోని వెలుపలి ద్వీపాల్లో రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో.. జపాన్ వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే సునామీ హెచ్చరికను జారీ చేసింది. జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షుకి దక్షిణంగా విస్తరించి ఉన్న ద్వీపాలకు ఒక మీటరు ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పున టోక్యో చుట్టూ ఉన్న చిబా ప్రిఫెక్చర్ నుంచి పశ్చిమాన కగోషిమా ప్రిఫెక్చర్ వరకు విస్తరించి ఉన్న పెద్ద ప్రాంతానికి హెచ్చరిక వర్తింపజేయడంతో.. హోన్షులో 0.2 మీటర్ల వరకు చిన్నపాటి సునామీ ఉప్పెనలు వచ్చే అవకాశం ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హచిజో ద్వీపంలోని యానే ప్రాంతంలో దాదాపు 30 సెంటీమీటర్ల (1 అడుగు) చిన్న సునామీ ఏర్పడిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే ప్రకారం.. జారీ చేయబడిన సునామీ హెచ్చరిక జపాన్ నాలుగు స్థాయి హెచ్చరిక వ్యవస్థలో రెండవ అత్యల్ప స్థాయిలో ఉంది. తీరాలు, నదీ ముఖాలకు దూరంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. 

ఇక, జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. టోరిషిమా ద్వీపానికి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు సంభవించిన భూకంపం 6.6 తీవ్రతతో సంభవించింది. టోక్యోకు దక్షిణంగా 550 కి.మీ దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూకంప కేంద్రం ఉంది. దీంతో జపాన్ వాతావరణ శాఖ.. ముందస్తుగా సునామీ హెచ్చరికను జారీచేసింది.