Asianet News TeluguAsianet News Telugu

యూకే ప్రధాని రిషి సునక్ దంపతులతో జైశంకర్ భేటీ.. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ బహుమతిగా అందజేత

యూకే ప్రధాని రిషి సునక్ దంపతులను భారత విదేశాంగ మంత్రి జై శంకర్ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం జై శంకర్ దంపతులు వారికి వినాయకుడి విగ్రహాన్ని, విరాట్ కోహ్లి సంతకం చేసిన బ్యాట్ ను బహుకరించారు.

Jaishankar met UK Prime Minister Rishi Sunak's couple. Virat Kohli's autographed bat was presented as a gift..ISR
Author
First Published Nov 13, 2023, 9:47 AM IST

యూకే అధికారిక పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని రిషి సునక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిలను కలిశారు. ఈ సమయంలో జై శంకర్ వెంట ఆయన సతీమణి క్యోకో కూడా ఉన్నారు. వారిద్దరూ కలిసి రిషి సునక్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వినాయకుడి విగ్రహాన్ని, భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్ ను బహుమతిగా అందించారు. 

బ్రిటన్ ప్రధానితో భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ‘‘దీపావళి రోజున ప్రధాని రిషి సునక్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా యూకే ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమకాలీన కాలానికి అనుగుణంగా సంబంధాలను పునర్నిర్మించడంలో భారతదేశం-యూకే చురుకుగా నిమగ్నమయ్యాయి. సునక్ దంపతుల ఆత్మీయ స్వాగతం, మర్యాదపూర్వక ఆతిథ్యానికి ధన్యవాదాలు.’’ అని పేర్కొన్నారు.

కాగా.. ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్ లో అధికారిక పర్యటనలో ఉన్న జైశంకర్ యూకే విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీతో సమావేశం కానున్నారు. శనివారం బ్రిటన్ చేరుకున్న ఆయన పర్యటన నవంబర్ 15న ముగియనుంది. ఈ పర్యటనలో అక్కడి పలువురు ప్రముఖులను కూడా కలవనున్నారు.

భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం పెరుగుతోందని, 2021లో ఇరు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయని ఈ పర్యటన నేపథ్యంలో ఎంఈఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘భారత్, యూకే మధ్య స్నేహపూర్వక, అభివృద్ధి చెందుతున్న బంధం ఉంది. ఇండియా-యూకే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ను 2021లో ఇండియా-యూకే రోడ్ మ్యాప్ 2030తో పాటు ప్రారంభించింది’’ అని తెలిపింది. రెండు దేశాలకు ఉపయోగపడే భాగస్వామ్యానికి ఈ రోడ్ మ్యాప్ నిబద్ధత అని, ఈఏఎం పర్యటన ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని పేర్కొంది.

అంతకు ముందు నవంబర్ 3న ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ టెలిఫోన్ సంభాషణలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురోగతిపై చర్చించారు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచ కప్ లో టీం ఇండియా అద్భుత ప్రదర్శనపై ప్రధాని మోడీని సునక్ అభినందించారు. యూకే, భారత్ మధ్య స్నేహం గురించి ప్రస్తావిస్తూ.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఇటీవలి పురోగతిపై నేతలు చర్చించారు. ‘‘ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూర్చే ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని సాధించడం ప్రాముఖ్యతను వారు అంగీకరించారు’’ అని యూకే ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios