భారత్ బాంబులు వేసింది నిజమే: ఒప్పుకున్న అజార్ సోదరుడు
భారత్ జరిపిన వైమానిక దాడుల వల్ల తమ భూభాగంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎటువంటి ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కాలేదని.. కేవలం కొన్ని చెట్లు మాత్రం కాలిపోయాయంటూ పాకిస్తాన్ చేప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి
భారత్ జరిపిన వైమానిక దాడుల వల్ల తమ భూభాగంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎటువంటి ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కాలేదని.. కేవలం కొన్ని చెట్లు మాత్రం కాలిపోయాయంటూ పాకిస్తాన్ చేప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి.
తమపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ మెరుపుదాడులు చేసింది నిజమేనని జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ తమ్ముడు మౌలానా అమర్ వెల్లడించారు. ఐఏఎఫ్ దాడులు జరిపిన తర్వాతి రోజున జైషే సీనియర్లతో జరిగిన సమావేశంలో అమర్ మాట్లాడినట్లుగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దీని ప్రకారం... ‘‘బాలాకోట్లోని జైషే క్యాంపులపై వైమానిక దాడులు జరిగింది నిజమేనని... అయితే జిహాద్ బోధనా కేంద్రంపై మాత్రమే దాడులు జరిగాయని అమర్ చెప్పారు. భారత్ చెప్తున్నట్లు జైషే కీలక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు.
మా భూభాగంలోకి వచ్చి మరీ జిహాద్ బోధనా కేంద్రంపై భారత్ దాడులకు దిగడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. ఈ చర్యతో తమకు భారత్ ప్రతీకారానికి మంచి అవకాశం ఇచ్చిందన్నాడు.
తమపై దాడి చేసి యుద్ధానికి కాలు దువ్విందని అమర్ వ్యాఖ్యానించాడు. కశ్మీర్ను రక్షించుకునేందుకు జిహాద్ శిక్షణ పొందుతున్న వారికి సర్జికల్ స్ట్రైక్స్ మరింత కోపం తెప్పించాయని పేర్కొన్నాడు.
మరోవైపు భారత వైమానిక దాడుల్లో ‘‘జబా టాప్’’ అనే కొండ ప్రాంతంలో చాలా మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 30 శవాలను తరలించేందుకు అంబులెన్సులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు శిక్షణనిస్తున్న మాజీ ఐఎస్ఐ అధికారి కల్నల్ సలీం కూడా మరణించినట్లు సమాచారం.