ఆపరేషన్ సింధూర్: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. INS విక్రాంత్ పాకిస్తాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై క్షిపణి దాడి చేసిందని ప్రచారం జరుగుతోంది.

ఆపరేషన్ సింధూర్: ఆపరేషన్ సింధూర్ తర్వాత మూడు రోజులుగా పాకిస్తాన్ ఆగ్రహంతో ఉంది. భారత భూభాగంపై నిరంతర షెల్లింగ్ చేస్తోంది. గురువారం పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటి డజనుకు పైగా పెద్ద దాడులు జరిగాయి, వీటిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ విఫలం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో భారత సైన్యం పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసిందని ప్రచారం జరుగుతోంది. అరేబియా సముద్రంలో  INS విక్రాంత్, కరాచీ ఓడరేవుపై ప్రతీకార చర్యగా దాడి చేసి నాశనం చేసిందని చెబుతున్నారు. అయితే, ఈ వార్తలను అధికారికంగా సైన్యం గానీ, బాధ్యతగల వ్యక్తులు గానీ ఇపపటి వరకూ ధృవీకరించలేదు.

కొన్ని మీడియా కథనాల ప్రకారం, భారత నౌకాదళం కరాచీ, ఒర్మారా ఓడరేవులపై వరుస క్షిపణి దాడులు చేసింది. కరాచీ ఓడరేవుపై వరుసగా 12 పేలుళ్లు సంభవించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి, ప్రజలు ప్రాణాలను రక్షించుకోవడానికి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.INS విక్రాంత్ నుండి ప్రయోగించిన క్షిపణులు నేరుగా పాకిస్తాన్ నౌకాదళ స్థావరాలను, వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని చెబుతున్నారు.

పాకిస్తాన్ జమ్మూను లక్ష్యంగా చేసుకుంది

ఆపరేషన్ సింధూర్‌తో ఆగ్రహించిన పాకిస్తాన్ గురువారం జమ్మూలోని సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా ప్రాంతాలపై ఎనిమిది క్షిపణులు ప్రయోగించింది. వీటిని భారత వైమానిక రక్షణ విభాగాలు అడ్డుకున్నాయి. పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ భారతదేశ నగరాలను కూడా లక్ష్యంగా చేసుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెల్లడించింది. ఈ సమయంలో అవంతిపోరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, బతిందా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్‌లలో డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించారు. వీటిని కూడా భారత్ విఫలం చేసింది. ఈ దాడి 'హమాస్ తరహా'లో జరిగింది. హమాస్ ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో చౌకైన రాకెట్లతో నగరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ISI, హమాస్ ఇటీవల PoJKలో సమావేశమైనట్లు భావిస్తున్నారు.

బ్లాక్అవుట్, కర్ఫ్యూ వాతావరణం

పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను బంకర్లకు తరలిస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌లోని జమ్మూ, ఉధంపూర్, కిష్త్‌వార్, అఖ్నూర్, సాంబా, శ్రీనగర్, అనంతనాగ్, రాజస్థాన్‌లోని బార్మెర్, బికానెర్, శ్రీగంగానగర్, పంజాబ్‌లోని చండీగఢ్, మొహాలీ, జలంధర్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, తర్న్‌తారన్, గుజరాత్‌లోని భుజ్, కచ్, పాటన్‌లలో పూర్తిగా బ్లాక్‌అవుట్ ప్రకటించారు. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసం చేయకుండా ఉండేందుకు అనేక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ విధించారు.