ఈ నెక్లస్ వేసుకుంటే.. కరోనా మిమ్మల్ని టచ్ చేయదు
ఇండోనేషియాలో ఓ మొక్క ఆకులతో తయారు చేసిన నెక్లెస్ను ధరిస్తే చాలు వైరస్ నశిస్తుందని చెబుతోంది
కరోనా వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. అయితే ఇండోనేషియాలో ఓ మొక్క ఆకులతో తయారు చేసిన నెక్లెస్ను ధరిస్తే చాలు వైరస్ నశిస్తుందని చెబుతోంది.
ఆ దేశానికి చెందిన ఆరోగ్య పరిశోధన & అభివృద్ధి సంస్థ బాలిట్బాంగ్తన్ నీలగిరి ఆకులతో యాంటీవైరస్ నెక్లెస్ను తయారు చేసింది. దీనిని మెడలో వేసుకుంటే కోవిడ్ దరిచేరదని ప్రకటించింది.
దీనిని ధ్రువీకరించిన ప్రభుత్వం ఈ నెక్లెస్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయిస్తోంది. దీనిపై ఇండోనేషియా వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ... కరోనాను చంపడానికి నీలగిరి జాతికి చెందిన 700 రకాల మొక్కలతో వీటిని తయారు చేశామని తెలిపారు.
ఈ నెక్లెస్ పావుగంట ధరిస్తే 42 శాతం వైరస్ను చంపుతుందని ఆయన అన్నారు. ఇదే సమయంలో అరగంట ధరిస్తే 80 శాతం వైరస్ను అంతమొందిస్తుందని మంత్రి చెప్పారు. తాను వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తునప్పుడు ఈ నెక్లెస్ను ధరిస్తున్నానని... ఇది బాగా పనిచేస్తోందని మంత్రి సెహ్రూల్ యాసిన్ తెలిపారు.
బాలిట్బాంగ్తన్ ఈ యాంటివైరస్ నెక్లెస్తో పాటు నీలగిరి మొక్కలతో ఇన్హీలర్, శానిటైజర్, క్రీమ్స్, ఆయిల్స్ సైతం రూపొందించిందని ఆయన చెప్పారు. పాజిటివ్గా తేలిన వారికి ఈ నెక్లెస్ ధరించడం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తొలగిపోయి .. కోలుకున్నారని మంత్రి తెలిపారు.
మరోవైపు బాలిట్బాంగ్తన్ తయారు చేసిన యాంటీవైరస్ నెక్లెస్ పనితీరుపై ఇండోనేషియన్ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదని వారు కొట్టిపారేస్తున్నారు.