డోర్ బెల్ కేసు.. భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి జీవిత ఖైదు..
అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి జీవిత ఖైదు పడింది. అతను ఉద్దేశపూర్వకంగా తన కారుతో ముగ్గురు పదహారేళ్ల యువకులను హతమార్చడంతో పాటు మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ కేసులో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి జీవిత ఖైదు పడింది. రాత్రివేళల్లో తరుచు డోర్బెల్ కొట్టి ఆటపట్టించిన ముగ్గురు యువకులను హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన అనురాగ్ చంద్ర దోషిగా తేలి, జీవిత ఖైదు శిక్షను విధించింది న్యాయ స్థానం. ఈ ఘటన 2020లో జరిగింది. ముగ్గురిని హత్య చేసినట్లు, మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసినట్టు ఆరోపణల కేసులో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి.. పెరోల్ అవకాశం కూడా లేదని తాజా తీర్పులో వెల్లడించింది.
కాలిఫోర్నియా నివాసి అనురాగ్ చంద్ర (45) ఏప్రిల్లో మూడు హత్యలు, ముగ్గురిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారించారు. , తాజాగా శిక్షలు ఖరారు చేసింది. రివర్ సైడ్ కౌంటీలోని జ్యూరీకి ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి మూడు గంటలు పట్టినట్లు జిల్లా అటార్నీ కార్యాలయం జూలై 14న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. యువకులు ప్రయాణిస్తున్న వాహనాన్ని చంద్ర ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్లు విచారణలో తేలింది.
అసలేం జరిగింది?
జనవరి 19, 2020 రాత్రి టెమెస్కల్ కాన్యన్ రోడ్లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు యువకులు తన మిత్రుడి ఇంట్లో నిద్రించేందుకు వచ్చారు. ఈ సమయంలో ఓ ఆకతాయి కుర్రాడు డోర్ బెల్ మోగించి ఆటపట్టించే ఆటకు ఆడాడు. ఇందుకోసం పొరుగున్న అనురాగ్ చంద్ర ఇంటికి డోర్ బెల్ పలుమార్లు మోగించి ఆటపట్టించాడు. ఆ తర్వాత ఆరుగురు తమ కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో కోపోద్రిత్తుడైన అనురాగ్ చంద్ర తన కారులో వారిని వెంబడించాడు. తన కారుతో వారి కారును ఢీకొట్టాడు. చంద్ర తన వాహనాన్ని ఢీకొట్టడంతో కారు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదం తరువాత.. అనురాగ్ చంద్ర సంఘటన గురించి ఎవరికీ తెలియజేయకుండా అక్కడి నుండి పారిపోయి తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ ప్రమాదంలో డేనియల్ హాకిన్స్, జాకబ్ ఇవెస్కు, డ్రేక్ రూయిజ్ మరణించారు. అందరూ పదహారేళ్ల వారే. కాగా టయోటా ప్రియస్ కారును 18 ఏళ్ల యువకుడు నడుపుతున్నాడు. డ్రైవర్తో పాటు 13, 14 ఏళ్ల ఇద్దరు బాలురు గాయపడ్డారు. 2020 జనవరి 20న అరెస్ట్ అయిన అనురాగ్ చంద్ర అప్పటి నుండి రివర్ సైడ్ లోని రాబర్డ్ ప్రెస్లీ డిటెన్షన్ సెంటర్లో కస్టడీలో ఉన్నాడు. మరో కేసులోనూ దుష్ప్రవర్తన ఆరోపణలు రాగా, అనురాగ్ చంద్ర నేరాన్ని అంగీకరించాడు.