ప్రతిభ ఆధారిత వలస బిల్లుకు నో చెప్పిన రిపబ్లికన్లు!
వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపట్ల యావత్ ప్రపంచం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఈ విషయంలో ఆయన వ్యవహారశైలిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపట్ల యావత్ ప్రపంచం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఈ విషయంలో ఆయన వ్యవహారశైలిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వలసలనేవి ప్రతిభ ఆధారంగానే ఉండాలన్న ట్రంప్ వాదనలను ఆ దేశ ప్రతినిధులే కొట్టిపారేశారు. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు గురువారం ప్రతినిధుల సభలో వీగిపోయింది.
అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బాబ్ గుడ్లాటె ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సానుకూలంగా 121 ఓట్లు రాగా, ప్రతికూలంగా 301 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందలేకపోయింది. ఒకవేళ ఈ సభలో బిల్లు ఆమోదం పొందినట్లయితే, ఎగువ సభలో మాత్రం ఖచ్చితంగా డెమోక్రాట్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేసేవారని చెప్పుకుంటున్నారు. దేశాల వారీ గ్రీన్కార్డు కోటాను రద్దు చేయడంతో పాటు భారత్ వంటి వర్ధమాన దేశాల పౌరులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపర్చిన సంగతి తెలిసినదే.
డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఓటింగ్కు ముందే ఇరు పార్టీల సభ్యులను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. ఓటింగ్ అనంతరం డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ మాట్లాడుతూ.. రిపబ్లికన్లు ఏకపక్షంగా ప్రవేశపెట్టిన మరో బిల్లు కూడా ఓటమిపాలైందని అన్నారు. ఇదే విషయంపై మరో హౌస్ మెంబర్ టాడ్ షూల్టే మాట్లాడుతూ.. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమయ్యేలా బిల్లులో మార్పులు చేయడమే మిగిలిన ఏకైక మార్గమని అన్నారు. చట్టబద్ధంగా అమెరికాలోకి వలస వచ్చే వారికి తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు ప్రతికూలంగా మారిందని, ఇది వలస కుటుంబాలను, వారి పిల్లల నిర్బంధాన్ని సమర్థించేలా ఉందని వ్యాఖ్యానించారు.