అమెరికాలో దారుణం: నలుగురిని పొడిచి చంపిన దొంగ
అమెరికాలో ఓ దుండగుడు ఆరుగురిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
వాషింగ్టన్:అమెరికాలో ఓ దుండగుడు యధేచ్ఛగా కత్తితో దాడికి పాల్పడడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నిందితుడిని పోలీసులు పట్టుకొన్నారు.
అమెరికాలోని మాన్గ్రోవ్ సిటీలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి తన అపార్ట్మెంట్ లో ఓ దుకాణ నిర్వాహకుడికి కత్తి చూపి బెదిరింపులకు పాల్పడ్డాడు. దుకాణంలో ఉన్న నగదును దోచుకొన్నాడు.
ఆ తర్వాత అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును తన వద్ద ఉన్న కత్తితో పొడిచి చంపాడు. సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని తీసుకొని వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న తుపాకీ, కత్తితో అక్కడే ఉన్న మరో ఆరు దుకాణాల్లో దోపిడికి పాల్పడ్డాడు.
ఆరుగురిని దుండగుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.దుండగుడు యదేచ్ఛగా ఈ ప్రాంతంలో సుమారు మూడు గంటలపాటు రెచ్చిపోయాడు. తనకు ఇష్టారీతిలో వ్యవహరించాడు. నిందితుడిని సాంటాఅనా సిటీలో పోలీసులు పట్టుకొన్నారు.