ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.  ఈ పేలుళ్లు పలు స్కూల్స్ ను లక్ష్యంగానే చేసుకొని జరిగాయి. ఈ ఘటనలో 6 గురు చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా మందికి గాయాలు అయ్యాయి. 

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని ఓ బాయ్స్ స్కూల్స్ లో మంగ‌ళ‌వారం పేలుళ్లు సంభవించాయి. ఈ ప్ర‌మాదాల్లో 6 గురు చ‌నిపోయారు. మ‌రెంతో మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అబ్దుల్ రహీమ్ షాహిద్ హైస్కూల్‌లో పేలుళ్లు జరిగాయని, ‘‘మా షియా సోదరులకు ప్రాణనష్టం వాటిల్లింది’’ అని కాబూల్ పోలీసు అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ ట్విట్టర్‌లో తెలిపారు. విద్యార్థులు తమ తరగతుల నుంచి బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ పాఠశాల దాష్ట్-ఎ-బర్చిలో ఉంది. ఇందులో ప్రధానంగా హజారా కమ్యూనిటీ ప్ర‌జ‌లు నివసిస్తారు. 

ఇదిలా ఉండగా పశ్చిమ కాబూల్‌లో రెండు బాంబు దాడులు జరిగాయని, ఆరుగురు వ్యక్తులు మరణించారని, డజన్ల కొద్దీ వ్యక్తులు గాయపడ్డారని స్పుత్నిక్ తెలిపింది. పశ్చిమ కాబూల్‌లోని ముంతాజ్ స్కూల్ క్యాంపస్‌లో మొదటి పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి పలువురు గాయపడ్డారు. రాజధానిలోని దష్త్-ఎ-బర్చి జిల్లాలో మరో పాఠశాల సమీపంలో రెండో పేలుడు సంభవించింది. 

పాఠశాలలో జరిగిన పేలుళ్లను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింద‌ని, ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు ప్రారంభించిందని ఆఫ్ఘన్ న్యూస్ ఛానెల్ టోలో న్యూస్ తెలిపింది. ఈ దాడికి ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది