ఎలాన్ మస్క్ కొత్త పార్టీపై సర్వేలో 80% మంది మద్దతు, ట్రంప్‌పై ఆరోపణలతో రాజకీయ వివాదం మళ్లీ ఉధృతమైంది.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య రాజకీయ విమర్శలు, ఆరోపణలు తీవ్రంగా మారుతున్న వేళ.. మస్క్ చేసిన ఓ కొత్త ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫామ్‌లో మస్క్ ఇటీవల ఓ ప్రశ్న వేయడం జరిగింది. అమెరికాలో 80 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం కలిగించేలా ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరమా అనే విషయంపై ఓటింగ్ నిర్వహించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘ది అమెరికా పార్టీ’

ఈ ఓటింగ్‌కు పెద్ద ఎత్తున స్పందన లభించింది. మొత్తం ఓటర్లలో 80 శాతం మంది కొత్త పార్టీ అవసరమేనని మద్దతు తెలిపారు. ఓటింగ్ ఫలితాలు వెల్లడించిన మస్క్, ఇది ప్రజల అభిప్రాయమేనని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆయన ‘ది అమెరికా పార్టీ’ పేరును ఉపయోగిస్తూ ఓ పోస్టు చేశారు. దీంతో ఇది ఆయన పార్టీకి పెట్టబోయే పేరు అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మస్క్ నుంచి ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

డోజ్‌ నుంచి తప్పించడమే…

ఇదే సమయంలో ట్రంప్‌తో మస్క్‌ మధ్య ఘర్షణలు మరింత ఉత్కంఠగా మారాయి. ట్రంప్ తన సాయంతోనే అధ్యక్ష పదవి గెలిచారని మస్క్ వ్యాఖ్యానించగా, ట్రంప్ మాత్రం అది ఖండించారు. తాను ఎవరి సహాయం లేకుండానే గెలిచానని చెప్పారు. మస్క్‌ను ప్రభుత్వ సంస్థ డోజ్‌ నుంచి తప్పించడమే అసలైన కారణమని ట్రంప్ ఆరోపించారు.

దీనికి ప్రతిగా మస్క్‌ కూడా తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. లైంగిక నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టైన్ కేసులో ట్రంప్ పాత్ర ఉందంటూ ఆరోపించారు. ఆ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం లీక్ చేయకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ ప్రతిపాదన అమెరికా రాజకీయాల్లోకి కొత్త మలుపు తెస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయమే.