జపాన్ లో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు
జపాన్ లో ఇవాళ భూకంపం చోటు చేసుకుంది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్పారు.
టోక్యో: ఉత్తర జపాన్లోని హక్కైడో ప్రివెక్చర్ లో ఆదివారంనాడు భూకంపం వాటిల్లింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. భూకంప కేంద్రం ఉరకవా పట్టణం తీరంలో ఉంది. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న జపాన్ లోని ఉత్తర ద్వీపమైన హక్కైడో తూర్పు తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం వాటిల్లింది . ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నెమురో ద్వీపకల్పంలో 61 కి.మీ లోతులో భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయని నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎర్త్ సైన్స్ డిజాస్టర్ తెలిపింది.జపాన్ లోని ప్రధాన ఉత్తర దీవుల్లో హక్కైడో ఒకటి. గత సోమవారంనాడు ఇదే ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది.
జపాన్ లో భూకంపాలు సర్వసాధారణం. అయితే భూకంపాలతో పాటు సునామీలు కూడ ఈ దేశంలో వస్తుంటాయి. అయితే ఇవాళ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు