ఆరు సంవత్సరాల క్రితం చైనా పాకిస్తాన్ లో మొదలు పెట్టిన మొహ్మండ్ డ్యామ్ నిర్మాణ పనులను ఇప్పుడు త్వరతిగతిన పూర్తి చేయాలని భావిస్తుంది.
పాకిస్తాన్లో మొదలు పెట్టిన మొహ్మండ్ డ్యామ్ పనులను వేగవంతం చేయనున్నట్లు చైనా ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా సింధు నదీ జల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం బయటకు వచ్చింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మొహ్మండ్ డ్యామ్ నిర్మాణం వేగవంతం చేయాలని చైనా నిర్ణయించిందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.
జల విద్యుత్ ప్రాజెక్టులో..
2019 సెప్టెంబర్లో చైనా మొహ్మండ్ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. డ్యామ్లో కాంక్రీట్ పనులు మొదలయ్యాయని అక్కడి అధికారులు ప్రకటించారు. ఇది జల విద్యుత్ ప్రాజెక్టులో కీలక దశ అని తెలుస్తుంది.చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది.
సాగునీటిలో 80 శాతం..
800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, పెషావర్కు రోజుకి 30 కోట్ల గాలన్ల తాగునీరు, సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చైనా పర్యటనకు ముందు ఈ నిర్ణయం వెలువడింది. నిన్న బీజింగ్ చేరుకున్న దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అవుతారు.సింధు నదీ జల ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదుల నీరు పాకిస్తాన్కు దక్కుతుంది. పాకిస్తాన్కు తాగునీరు, సాగునీటిలో 80 శాతం ఈ నదుల నుంచే వస్తుంది. అందుకే ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్కు పెద్ద దెబ్బ. రక్తం, నీరు కలిసి ప్రవహించవని హెచ్చరించి ఇండియా ఈ ఒప్పందాన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే.