2025 తొలి త్రైమాసికంలో కెనడా భారత విద్యార్థులకు స్టడీ పర్మిట్లు 31 శాతం తగ్గించింది.
కెనడాలో చదవాలని ఆశపడుతున్న భారతీయ విద్యార్థులకు ఈసారి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఆ దేశ ప్రభుత్వం స్టడీ పర్మిట్ల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఏడాది తొలి త్రైమాసికంలో భారతీయులకు జారీ చేసిన స్టడీ పర్మిట్లు 31 శాతం మేర తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఇమిగ్రేషన్, రెఫ్యూజీ అండ్ సిటిజన్షిప్ కెనడా (IRCC) విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో కేవలం 30,640 పర్మిట్లే భారతీయులకు మంజూరు చేశారు. అదే సమయంలో గత ఏడాది అంటే 2024లో ఈ సంఖ్య 44,295గా ఉంది. ఈ తేడా కెనడా తీసుకుంటున్న మైగ్రేషన్ పరిమిత చర్యల ప్రభావంగా చెప్పవచ్చు.
ఇప్పటికే 2023లోనే కెనడా అంతర్జాతీయ విద్యార్థుల రాకపై నియంత్రణలు పెంచాలని నిర్ణయించుకుంది. 2023లో మొత్తం 6.81 లక్షల స్టడీ పర్మిట్లు జారీ చేసిన కెనడా, అందులో 2.78 లక్షలు భారతీయులకే ఇచ్చింది. అయితే 2024లో ఈ సంఖ్య 5.16 లక్షలకు తగ్గింది. అందులో భారతీయులకు 1.88 లక్షల పర్మిట్లు మాత్రమే దక్కాయి.
విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గించాలని…
కెనడాలో వసతి సమస్యలు, మౌలిక వసతులపై భారంగా మారుతున్న ఒత్తిడే ప్రభుత్వాన్ని ఈ నిర్ణయాలకు దారి తీసింది. ముఖ్యంగా గృహాల కొరత, రవాణా, ఆరోగ్య రంగాలపై భారం పెరగడంతో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గించాలని భావించింది.తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానిస్తూ, దేశ జనాభాలో విదేశీ విద్యార్థులు, వలస కూలీలు కలిపి 2028 నాటికి 5 శాతం మించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. దీన్ని సాధించేందుకు 2025లో స్టడీ పర్మిట్ల గరిష్ట సంఖ్యను 4.85 లక్షల నుంచి 4.37 లక్షలకు తగ్గించారు. ఇక 2026 నుంచి ఈ సంఖ్యను స్థిరంగా ఉంచనున్నారు.
కొత్తగా స్టడీ పర్మిట్లు దరఖాస్తు చేసే విద్యార్థులకు కూడా కఠినమైన నిబంధనలు అమలులోకి వచ్చాయి. 2024 జనవరి 1 నుంచి విద్యార్థుల వద్ద కనీసం 20,635 కెనడా డాలర్లు (దాదాపు రూ.12.7 లక్షలు) ఉన్నట్లు ఆధారంగా చూపించాలి. అలాగే, స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసేప్పుడు తప్పనిసరిగా సంబంధిత విద్యా సంస్థ నుంచి IRCC అనుమతి పొందిన డాక్యుమెంట్ సమర్పించాలి.
ఈ కొత్త మార్గదర్శకాలు భారత విద్యార్థులకు కెనడాలో విద్యనభ్యసించాలన్న కలను మరింత క్లిష్టం చేస్తున్నాయి.