ఆఫ్ఘనిస్తాన్: పాలన తాలిబన్ల హస్తగతం.. అధికారం అప్పగించి దేశం విడిచిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. స్పీకర్, మంత్రులు ఇప్పటికే పాకిస్తాన్కు పారిపోయారు. తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. తాలిబన్లకు అధికారం అప్పగించిన అనంతరం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అష్రఫ్ ఘనీ నిష్క్రమించారు. కాగా, కాబూల్లో ఆదివారం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నేటి ఉదయం తాలిబన్లు నగర శివార్లలోకి, అక్కడి నుంచి నగరంలోకి ప్రవేశించారు. దీంతో అఫ్గాన్ రాజధాని వారి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అనంతరం శాంతియుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం దేశ అధ్యక్షుడి ప్యాలెస్కు చేరుకున్నారు. దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్ మిర్జక్వాల్ మాట్లాడుతూ అధికార బదలాయింపు శాంతియుతంగా జరుగుతుందని తెలిపారు. మరోపక్క తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పజెప్పారు.
Also Read:కాబూల్ నుంచి ఇండియా బయల్దేరిన చివరి కమర్షియల్ ఫ్లైట్
అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేయగా.. స్పీకర్, మంత్రులు ఇప్పటికే పాకిస్తాన్కు పారిపోయారు. మరోవైపు ఆ దేశంలో సుమారు 1500 మంది భారత పౌరులు వున్నట్లుగా తెలుస్తోంది. వీరందరినీ తిరిగి స్వదేశానికి రావాల్సిందిగా అడ్వైజరీనీ జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. అటు తాలిబన్ల ఎంట్రీతో అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ అవుతోంది. ఆ దేశ దౌత్య సిబ్బందితో పాటు సైనిక సిబ్బందిని హెలికాఫ్టర్లలో తరలిస్తోంది. మరోవైపు కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసింది అమెరికా.