పక్షి ఢీకొనడంతో విమానం ఇంజిన్లో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్తో తప్పిన ప్రమాదం (Video)
అమెరికాలో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికి ఓ పక్షుల గుంపు ఎదురుగా వస్తూ దాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం రైట్ ఇంజిన్లో మంటలు వచ్చాయి. ఆ పైలట్ విమానాన్ని వెంటనే అదే విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు.
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ విమానం ఒహాయో రాష్ట్రంలో కొలంబస్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఫీనిక్స్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ కాగానే... కొద్ది దూరానికే ఓ పక్షుల గుంపు విమానానికి ఎదురుగా వచ్చింది. ఆ విమానాన్ని ఢీకొనింది. దీంతో విమానం కుడి వైపున ఉన్న ఇంజిన్ నుంచి పొగ వచ్చింది. ఆ తర్వాత మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఫ్లైట్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
కొలంబస్లోని జాన్ గ్లెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బోయింగ్ 737 ఫ్లైట్ 1958 ఫీనిక్స్ కోసం ఆదివారం ఉదయం బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షులు ఆ విమానాన్ని ఢీకొన్నాయి. ఎమర్జెన్సీ క్రూ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ విమానం వెంటనే మళ్లీ అదే కొలంబస్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్టు జాన్ గ్లెన్ కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓ ప్రకటనలో ట్విట్టర్లో వెల్లడించింది.
Also Read: Amritpal Singh: అమృత్పాల్ సింగ్ అరెస్టుపై తల్లి ఫస్ట్ రియాక్షన్.. ‘ఒక వీరుడిలా లొంగిపోయాడు’
పక్షులు విమానాన్ని ఢీకొన్న తర్వాత తమకు బిగ్గరగా శబ్దాలు వినిపించాయని ఆ సమయంలో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తెలిపాడు. అప్పుడు పైలట్ వెంటనే ఓ అనౌన్స్మెంట్ చేశాడని వివరించాడు. ఓ పక్షుల గుంపు తమ విమానాన్ని ఢీకొట్టిందని చెప్పాడని తెలిపాడు.
ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులంతా సురక్షితంగా కిందికి దిగారు. ఆ తర్వాత వారిని వేరే ఫ్లైట్లో పంపించినట్టు వివరించారు.