ఘోర బోటు ప్రమాదం.. 145 మంది మృతి.. ఓవర్లోడ్ తోనే బోటు బోల్తా !
Kinshasa: వాయవ్య కాంగో (రిపబ్లిక్ ఆఫ్ కాంగో) లో గతరాత్రి మోటరైజ్డ్ పడవ మునిగి 145 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి మరో 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఓవర్లోడ్ తోనే బోటు బోల్తా పడిందని అధికారులు పేర్కొన్నారు.
Congo boat accident: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. వాయువ్య కాంగోలోని ఒక నదిలో రాత్రిపూట సరుకులు, జంతువులతో ఓవర్లోడ్ చేయబడిన మోటరైజ్డ్ పడవ మునిగిపోవడంతో 145 మంది ప్రయాణికులు తప్పిపోయి చనిపోయారని అధికారులు గురువారం తెలిపారు. ఈ ప్రమాద సమయంలో 200 మందికి పైగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. బోటు మునిగిన ప్రమాదం నుంచి 55 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ పడవ పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా మంగళవారం అర్థరాత్రి బసంకుసు పట్టణానికి సమీపంలో లులోంగా నదిలో బోల్తా పడింది.
కనీసం 145 మంది తప్పిపోయారనీ, వీరంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఆ ప్రాంతంలోని సివిల్ సొసైటీ గ్రూపుల అధ్యక్షుడు జీన్-పియరీ వాంగేలా అంతకుముందు విలేకరులతో అన్నారు. పడవ మునిగిపోవడానికి ఓవర్లోడ్ కారణమని ఆయన చెప్పారు. ఇక్కడి నుంచి రవాణా మార్గాలు మెరుగ్గా లేకపోవడంతో ఇలా పడవల్లో ఓవర్లోడ్ ప్రయాణాలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారని అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
డజన్ల కొద్దీ మరణాలకు కారణమయ్యే పడవ మునిగిపోయే ప్రమాదాలు కాంగోలోని మారుమూల ప్రాంతాల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఇక్కడ కొన్నిసార్లు రోడ్డు మార్గంలో ప్రయాణం అసాధ్యం. చాలా వాటర్క్రాఫ్ట్లు వస్తువులతో పాటు ఈత కొట్టడం తెలియని వ్యక్తులతో నిండిపోయి ప్రయాణిస్తుంటాయి. అయితే, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో రెస్క్యూ కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉన్నాయి. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే మరణాలు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అక్టోబర్లో, ఈక్వెటూర్ ప్రావిన్స్లోని కాంగో నదిపై 40 మందికి పైగా ఇలాంటి పడవ ప్రమాదంలో మరణించారు.
కాంగోలో మిలీషియా దాడుల తర్వాత సామూహిక సమాధుల్లో 49 మృతదేహాలు
కాంగోలో మిలీషియా దాడుల అనంతరం సామూహిక సమాధుల్లో 49 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ నెలలో గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి, కోడెకో మిలీషియా, ఇతర సాయుధ బృందాలపై డిసెంబరు నుండి జరిగిన దాడుల్లో కనీసం 195 మంది మరణించారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వెలికితీసిన సామూహిక సమాధుల్లో కనీసం 49 మృతదేహాలను కనుగొన్నట్లు ఐక్యరాజ్యసమితి బుధవారం తెలిపింది. ఉగాండా సరిహద్దుకు సమీపంలోని ఇటూరి ప్రావిన్స్ లోని రెండు గ్రామాల్లోని సమాధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని ఐక్యరాజ్యసమితి డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ న్యూయార్క్ లో విలేకరులకు తెలిపారు.
ఈశాన్య కాంగోలోని ఈ ప్రావిన్స్ గత వారాంతంలో స్థానిక మిలీషియా గ్రూపు దాడులకు గురైంది. ఈ సామూహిక సమాధులకు స్థానిక మిలిటెంట్లతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని హక్ తెలిపారు. నయమాంబ గ్రామంలోని సామూహిక సమాధిలో ఆరుగురు పిల్లలతో సహా మొత్తం 42 మంది బాధితులను కనుగొన్నామనీ, ఎంబోగి గ్రామంలో మరో ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని హక్ చెప్పారు. వారాంతంలో కోడెకో మిలీషియాలు పౌరులపై దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిన వెంటనే శాంతి పరిరక్షక దళాలు ఆ ప్రాంతంలో గస్తీ ప్రారంభించాయి. అప్పుడే వారు భయంకరమైన ఆవిష్కరణలు చేశారు' అని హక్ తెలిపాడు.