Ibrahim Biari : ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించిన హమాస్ కమాండర్ ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. తాము జరిపిన వైమానిక దాడిలో అతడు మరణించాడని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

Ibrahim Biari : ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7న జరిగిన పాశవిక ఆకస్మిక దాడిలో కీలక పాత్ర పోషించిన హమాస్ టాప్ కమాండర్ ఇబ్రహీం బియారీని గాజాపై వైమానిక దాడుల్లో హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బుధవారం ప్రకటించింది. ఆయనను తమ యుద్ధ విమానాలు చుట్టుముట్టి మట్టుబెట్టాయని పేర్కొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ వైమానిక దాడుల్లో బియారీతో పాటు పెద్ద సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారని, దీంతో ఈ ప్రాంతంలో హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ దెబ్బతిందని సైన్యం తెలిపింది. ఈ దాడి తర్వాత భూగర్భ ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూడా కుప్పకూలాయని పేర్కొంది.

Scroll to load tweet…

ఎవరీ ఇబ్రహీం బియారీ ?
బియారీ హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ గా ఉన్నారు. అక్టోబర్ 7న 1,400 మందికి పైగా మరణానికి కారణమైన వినాశకరమైన దాడిని నిర్వహించడానికి హమాస్ గ్రూపుకు చెందిన 'నుఖ్బా' (ఉన్నత) దళాలను ఇజ్రాయెల్ కు పంపడానికి బియారీ బాధ్యత వహించాడని ఐడీఎఫ్ తెలిపింది.

2004లో 13 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకున్న అష్దోద్ పోర్టు ఉగ్రదాడిలో కూడా బియారీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులకు కూడా ఆయన దర్శకత్వం వహించారని, గాజాలోని ఐడీఎఫ్ దళాలపై దాడికి ఆయన కారణమని సైన్యం తెలిపింది. ఆయన ఆధ్వర్యంలో సెంట్రల్ జబాలియా బెటాలియన్ ఈ ప్రాంతంలోని పలు భవనాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇలాంటి అనేక భవనాలు ధ్వంసమయ్యాయి.

కాగా.. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 50 మంది మరణించారని గాజా హమాస్ ఆధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. జబాలియా శిబిరంలోని పెద్ద ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన మారణకాండలో 50 మందికి పైగా చనిపోయారని, 150 మంది గాయపడ్డారని, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇదిలా ఉండగా.. ఉత్తర గాజాలో హమాస్ తీవ్రవాదులతో పోరాడుతున్న మరో తొమ్మిది మంది సైనికులు మరణించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. అంతకుముందు, ఉత్తర గాజాలో జరిగిన పోరాటంలో ఇద్దరు సైనికులు మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. గత వారం చివర్లో మధ్యధరా భూభాగంలోకి భూదాడులు వేగవంతం అయిన తర్వాత తాము నివేదించిన మొదటి సైనిక మరణాలు ఇవేనని ఇజ్రాయెల్ తెలిపింది. కాగా.. ఈ యుద్ధంలో 8,500 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో ఎక్కువ మంది మహిళలు, మైనర్లు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అలాగే ఇజ్రాయెల్ వైపు 1,400 మందికి పైగా మరణించారు. ఇందులో హమాస్ ప్రారంభ దాడిలోనే అధిక మరణాలు ఉన్నాయి.