సిరియాలో శిథిలాల కింద తమ్ముడి తలను రెక్కకింద దాచిన సోదరి.. కదిలిస్తున్న చిత్రమిదే
భూకంపంతో సిరియా, టర్కీలో భవనాల శిథిలాలు గుట్టల్లా పేరుకుపోయాయి.ఆ శిథిలాల కింద వేలాది మంది కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా ఓ చిన్నారి తన సోదరుడు 17 గంటలపాటు ప్రాణాల కోసం పోరాడారు. తమ్ముడిని తల చేతి కిందికి తీసుకుని ఆ సోదరి రక్షిస్తున్న ఫొటో ఒకటి వైరల్ అవుతున్నది.
టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు ప్రజలను నిలువునా చీల్చినంత పని చేశాయి. కాళ్ల కింద భూమి కదలడంతో భవనాలు కూలిపోయి.. ప్రాణాలు ఆ శిథిలాల కింద కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 8,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల మేటలు అంత ఎత్తున ఉండటంతో ఇంకెన్ని మృతదేహాలు బయటపడతాయో అనే ఆందోళన లేకపోలేదు. అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ సంఘటనలు జరుగుతాయి.శిథిలాల కింద తానే ఇంకెంత కాలం ఊపిరిపీల్చుకుంటుందో తెలియని స్థితిలో ఏడేళ్ల చిన్నారి తల్లి తన తమ్ముడి ప్రాణం కోసం ఆరాటపడింది. తమ్ముడి తలను పక్షి తన గుడ్లను రెక్కల కిందకు తీసుకుని భద్రంగా చూసుకున్నట్టే తన రెక్క కిందకు తీసుకుంది. ఆ శిథిలాలు మరింత కిందికి జరిగితే తమ్ముడి తలకు గాయాలు కావొద్దని ఆలోచించింది. వారిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సిరియాలో ఓ చోట శిథిలాల కింది నుంచి అప్పుడే జన్మించిన నవజాత శిశువును అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఆ శిశువుకు, తల్లికి ఇంకా పేగు బంధం విడిపోనేలేదు. వారిద్దరూ పేగు ద్వారా కలిసి ఉన్నప్పుడే ఆమెను బయటకు తీసిన అసాధారణ ఘటన అక్కడ చోటుచేసుకుంది. మరో ఘటనలో అక్కా తమ్ముళ్ల ఆత్మీయ బంధం బయటపడింది.
Also Read: టర్కీలో భారీ భూకంపాలు.. రెండుగా చీలిపోయిన ఎయిర్పోర్టు రన్వే (వీడియో)
ఈ ఫొటోను యూఎన్ ప్రతినిధి మొహమద్ సఫా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ శిథిలాల కింద 17 గంటలు గడిపిన తర్వాత అదృష్టవశాత్తు ఆ చిన్నారులు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారని వివరించారు. ఈ ఫొటోను ఎవరూ షేర్ చేయడం లేదని తెలిపారు. ఒక వేళ ఆ చిన్నారి బాలిక మరణించి ఉంటే ఫొటోను చాలా మంది షేర్ చేసేవారని పేర్కొన్నారు. పాజిటివిటీని షేర్ చేయండి అంటూ సూచించారు.
సిరియాలో గతంలో కెమికల్ వెపన్స్ దాడి జరిగినప్పుడు ఓ చిన్నారి తన ముఖం నుంచి ఆక్సిజన్ మాస్క్ తీసేసి చంకలో ఎత్తుకున్న చిన్నారి సోదరుడికి పెట్టిన ఫొటో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.