ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం .. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే శుక్రవారం తెలిపింది. సముద్రంలో 594 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్లు గుర్తించారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే శుక్రవారం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 4.55 గంటలకు జావా ద్వీపానికి ఉత్తరాన సముద్రంలో శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. సముద్రంలో 594 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్లు గుర్తించారు. అయితే భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ అయినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ కొట్టిపారేసింది.
సురబయ, టుబాన్, డెన్పాసర్, సెమరాంగ్లలో భూకంప ప్రభావం వున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే యూరోపియన్ -మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్సీ) మాత్రం 6.5 తీవ్రతో భూకంపం సంభవించిందని, సముద్రంలో 592 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్లు తెలిపింది.
ఇకపోతే.. గురువారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. స్థానిక కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్లోని తనింబర్ దీవుల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.