కెన్యాలో 47 మృతదేహాల వెలికితీత.. ‘జీసస్ను కలవాలంటే ఆకలితో మరణించండి’
కెన్యాలో ఓ దారుణ ఘటన బయటకు వస్తున్నది. జీసస్ను కలవడానికి ఉపవాసముండి ఆకలితో మరణించాలని ఓ కల్ట్ లీడర్ మెకింజీ ఎన్థాంగే ఆయనను అనుసరిస్తున్నవారికి పిలుపు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా మరణిస్తున్నారు. ఇప్పటి వరకు 47 మంది ఆయన అనుచరుల డెడ్ బాడీలను వెలికి తీశారు.
న్యూఢిల్లీ: కెన్యాలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మత పెద్ద సూచనల మేరకు అతని విశ్వాసకులు ఆకలితో మరణించినట్టు అనుమానాలు వస్తున్నాయి. జీసస్ను కలవాలంటే ఆహారం తినకుండా ఉపవాసంతో మరణించాలని పిలుపు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆయనను అనుసరిస్తున్నవారు విగతజీవులై కనిపించడం కలకలం రేపింది. ఆదివారం మరో 26 మంది మృతదేహాలను కెన్యా పోలీసులు వెలికి తీశారు. దీంతో ఈ ఉదంతానికి సంబంధించి మృతదేహాల సంఖ్య మొత్తం 47కు చేరింది.
‘ఈ రోజు 26 డెడ్ బాడీలను వెలికితీశాం. దీంతో ఆ ఏరియాలో మొత్తం ఇలా వెలికితీసిన మృతదేహాల సంఖ్య 47కు చేరింది’ అని ఈస్ట్రన్ కెన్యా మాలిండి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ హెడ్ చార్లెస్ కాము తెలిపారు.
శనివారమే 21 డెడ్ బాడీలను పోలీసులు వెలికి తీశారు. ఓ కల్ట్ను పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఆ కల్ట్ను అనుసరిస్తూ మరణించేదాకా ఉపవాసం ఉండి మరణించారన్న అనుమానాలున్న 21 మంది మృతదేహాలను శనివారం బయటకు తీశారు.
గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ లీడర్ మెకింజీ ఎన్థాంగే తనను అనుసరిస్తున్నవారికి ఇచ్చిన పిలుపు కలకలం రేపింది. జీసస్ను కలుసుకోవాలంటే ఆకలితో మరణించాలని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే కెన్యా పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఏడుగురి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు.
గత నెలల తనంతటా తానే మెకింజీ ఎన్థాంగే పోలీసుల వద్దకు చేరాడు. తల్లిదండ్రుల కస్టడీలోనే ఇద్దరు పిల్లలు ఉపవాసముండి ఆకలితో మరణించిన ఘటన చోటుచేసుకున్న తర్వాత అతను పోలీసులను ఆశ్రయించాడు.
1,00,000 కెన్యన్ షిల్లింగ్లు (700 అమెరికన్ డాలర్ల) పూచీకత్తు మీద బెయిల్ పొందాడు.
ఆయన అనుచరుల నాలుగు డెడ్ బాడీలను పోలీసులు కనుగొన్న తర్వాత ఏప్రిల్ 15వ తేదీన పోలీసులు మెకింజీ ఎన్థాంగేను అరెస్టు చేశారు. శుక్రవారం ముగ్గురి డెడ్ బాడీలను కనుగొన్నారని పోలీసులు వివరించారు.
ఈ చర్చకు వచ్చే మరో 11 మందిని పోలీసులు ఏప్రిల్ 14వ తేదీన హాస్పిటల్ తీసుకెళ్లారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది.