మరోసారి దద్దరిల్లిన కాబూల్.. బాంబు పేలుడులో నలుగురి మృతి.. 25 మందికి తీవ్ర గాయాలు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. బుధవారం ఒక మసీదులో జరిగిన పేలుడులో నలుగురు మరణించారు. 25 మందికిపైగా గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈసారి బాంబు పేలుడు ఏకంగా హోం మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో ఉన్న మసీదులో జరిగింది. బుధవారం జరిగిన ఈ పేలుడులో 4 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ నఫాయ్ టాకోర్ తెలిపారు. పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
తరుచుగా కాబూల్లో ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్ల వార్తలు తెరపైకి వస్తున్నాయి. పశ్చిమ కాబూల్లోని షాహిద్ మజ్రీ రోడ్డులోని పుల్-ఎ-సుఖ్తా ప్రాంతంలో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. అంతకుముందు సెప్టెంబర్ 30న జరిగిన బాంబు పేలుళ్లలో 53 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి (UN) నివేదిక ప్రకారం, ఈ పేలుడులో 53 మంది మరణించారు. ఇందులో 46 మంది బాలికలే ఉండటం గమనార్హం.
మసీదులో పేలుడు.. 14 మంది మృతి..
కేవలం రెండు వారాల క్రితం, ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లోని ఒక మసీదు సమీపంలో పేలుడు సంభవించింది, ఇందులో 14 మంది మరణించారు. గత నెలలో ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్లోని ఓ మసీదులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ప్రముఖ మతపెద్ద సహా 18 మంది చనిపోయారు.
'సామాన్యులను టార్గెట్ చేశారు'
మీడియా నివేదికల ప్రకారం... హెరాత్ నగరంలోని మసీదులో జరిగిన పేలుడుపై, ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫాయ్ తాకోర్ మాట్లాడుతూ.. ఈ పేలుడులో సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.