Mega Tsunami: కాస్కేడియా విభజన మండలిలో భారీ భూకంపం సంభవిస్తే, అమెరికా పశ్చిమ తీరాన్ని 1000 అడుగుల ‘మెగా సునామీ’ పూర్తిగా నాశనం చేస్తుందని తాజాగా ఒక అధ్యయనం హెచ్చరించింది.
Mega Tsunami may hit US West Coast: అమెరికా పశ్చిమ తీర ప్రాంతాన్ని పూర్తిగా అంతంచేసే విధంగా 1000 అడుగుల ఎత్తైన ‘మెగా సునామీ’ వచ్చే అవకాశం ఉందని వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ సునామీ ప్రమాదం సాధ్యమైన పరిణామమనే విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో వెల్లడించింది.
ఉత్తర కాలిఫోర్నియా నుండి బ్రిటిష్ కొలంబియా వరకూ విస్తరించిన 700 మైళ్ల కాస్కేడియా విభజన మండలిలో సంభవించే భారీ భూకంపం ఈ విపత్తుకు నాంది కావొచ్చని అధ్యయన పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలో ఇది "ది బిగ్ వన్" అనే పేరుతో ప్రసిద్ధి పొందిన భూకంప ప్రమాద ప్రాంతం.
మెగా సునామీపై వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈ విభజన మండలి ఉత్తర అమెరికాలో అత్యంత చురుకైన భూకంప మండలిగా గుర్తించారు. ఈ ప్రాంతంలో వచ్చే 50 సంవత్సరాల్లో 8.0 తీవ్రత గల భూకంపం సంభవించే అవకాశం 15 శాతంగా ఉందని అధ్యయనం పేర్కొంది. అటువంటి భూకంపం సంభవిస్తే, తీర ప్రాంత భూమి 6.5 అడుగుల వరకూ జరిగే అవకాశం ఉంది. ఇది సునామీ ప్రభావాన్ని మరింత పెంచుతుంది.
వర్జీనియా టెక్ భూగర్భశాస్త్ర విభాగం సహాయ ప్రొఫెసర్ టినా దురా మాట్లాడుతూ.. “కాస్కేడియా భూకంపం తర్వాత తీర ప్రాంత ఉప్పెన భూభాగ విస్తరణను ఇంతవరకు శాస్త్రీయంగా లెక్కించలేదు. ఇది భూ వినియోగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది” అని చెప్పారు.
మెగా సునామీతో పెద్ద నగరాలు కనుమరుగు
ఈ ‘మెగా సునామీ’ వల్ల అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా దక్షిణ వాషింగ్టన్, ఉత్తర ఒరెగాన్, ఉత్తర కాలిఫోర్నియా నిలిచే అవకాశం ఉంది. సీటల్, పోర్ట్ల్యాండ్ వంటి నగరాలు తీవ్రమైన విధ్వంసాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అలాస్కా, హవాయి వంటి ప్రాంతాలు కూడా తమ స్వంత సునామీ చరిత్ర, అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఈ ప్రభావానికి అతీతం కావని పేర్కొంది.
1958లో అలాస్కాలోని లిటుయా బేలో జరిగిన 1,719 అడుగుల ఎత్తుగల సునామీ కాస్కేడియా విభజన మండలిలో ఏర్పడినదే. అది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద సునామీ. హవాయి ద్వీపాలలో కూడా పూర్వ కాలంలో 1000 అడుగుల ఎత్తున లానాయ్ ద్వీపాన్ని తాకిన అలలు గుర్తించారు.
సాధారణ సునామీల కంటే భిన్నంగా ‘మెగా సునామీ’లు
అందువల్లే ఈ ‘మెగా సునామీ’లు సాధారణ సునామీలకంటే భిన్నంగా ఉంటాయి. అవి నిమిషాల వ్యవధిలోనే తీరాన్ని చేరుకుంటాయి. అలలు వందల అడుగుల ఎత్తు ఉండగలవు, మైళ్లదూరం లోపలికి చొచ్చుకుపోగలవు. హెచ్చరికల వ్యవస్థలు ఉన్నప్పటికీ, అలాంటి వేగవంతమైన విపత్తులకు తగినట్లుగా సమయానికి ప్రజలను రక్షించడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (FEMA) అంచనాల ప్రకారం, అటువంటి ఒక విపత్తుతో 13,000 పైగా మరణాలు సంభవించే అవకాశముంది. అలాగే, 27,000 మందికి పైగా గాయపడటం, 10 లక్షల మందికి పైగా నిర్వాసితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రహదారులు, విమానాశ్రయాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో, శాస్త్రవేత్తలు ముందస్తు హెచ్చరిక వ్యవస్థల బలోపేతం, ప్రజల్లో అవగాహన పెంపుదల, నిర్మాణాల బలపరిచే విధానాలపైనా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం 1700లో వచ్చిన చివరి కాస్కేడియా భూకంపం తీవ్రత 8.7-9.2 గా ఉండే అవకాశం ఉంది. అది జపాన్ తీరానికి కూడా సునామీని తీసుకొచ్చింది.