పాపం! 12 మంది పిల్లలు.. 10 రోజుల పాటు ఆ గుహలోనే..
వారంతా 13 నుంచి 16 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలే. సరదా కోసం గుహల్లోకి వెళ్లి చిక్కుకుపోయారు. చిమ్మ చీకటిలో ఎటు వెళ్లాలో తెలియక, తినడానికి తిండి లేక దాదాపు 10 రోజుల పాటు ఆ గుహల్లోనే ఉండిపోయారు.
వారంతా 13 నుంచి 16 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలే. సరదా కోసం గుహల్లోకి వెళ్లి చిక్కుకుపోయారు. చిమ్మ చీకటిలో ఎటు వెళ్లాలో తెలియక, తినడానికి తిండి లేక దాదాపు 10 రోజుల పాటు ఆ గుహల్లోనే ఉండిపోయారు. థాయ్లాండ్కి చెందిన 12 మంది విద్యార్థులు తమ ఫుట్బాల్ కోచ్తో కలిసి చియాంగ్ రాయ్ రాష్ట్రంలోని థామ్ లువాంగ్ గుహలను సందర్శించడానికి వెళ్లి అదృశ్యమైయ్యారు. తొమ్మిది రోజుల తర్వాత రెస్క్యూ టీమ్ వారిని సజీవంగా గుర్తించింది.
నాంగ్ నాన్ పర్వతం కింద ఉన్న ఈ గుహలు దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్నో మలుపులు, చీలికలతో కూడి ఉంటాయి. ఈ గుహల్లోకి ప్రవేశిస్తే తిరిగి సజీవంగా రావటం చాలా కష్టం. వర్షాకాలంలో ఈ గుహలు వరద నీటితో నిండిపోతాయి. ఈ జూనియర్ ఫుట్బాల్ టీమ్ సభ్యులు, వారి కోచ్తో కలిసి జూన్ 23వ తేదీ శనివారం ఈ గుహల్లోకి వెళ్లారు. కానీ బయటకు రాలేదు. దీంతో వీరి కోసం భారీ ఎత్తున గాలింపు, సహాయ చర్యలు చేపట్టారు. గుహల్లో నీటిలో డైవ్ చేసి గాలించే నిపుణులను రంగంలోకి దించారు.
బ్రిటన్ నుంచి వచ్చిన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు ఈ వరద నీటిలో గాలింపు చేస్తుండగా, గుహలో కొంత విశాలంగా ఉన్న ప్రాంతంలోని ఒక గట్టు మీద సహాయం కోసం బిక్కు బిక్కుమంటూ చూస్తున్న వీరిని గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటలకు ఈ బృందాన్ని కనిపెట్టారు. అయితే.. గుహలో నీటి మట్టం పెరుగుతుండటం, అక్కడికి చేరుకోవటానికి బురద ఆటంకంగా మారడంతో వారిని సురక్షితంగా వెలికి తీయటం పెద్ద సవాలుగా మారింది.
సాధారణంగా వర్షాకాలంలో ఈ గుహల్లోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది, అందుకే ఆ సమయంలో ఈ గుహల్లోకి ఎవ్వరినీ అనుమతించరు. అయితే, వర్షాలు తక్కువగా ఉన్నాయని భావించిన ఈ బృందం, గుహల్లోకి ప్రవేశించి, ఎటు వెళ్లలో తెలియక అక్కడే చిక్కుపోయారు. ఫుట్బాల్ ప్రాక్టీస్కని వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలు చేపట్టిన అధికారులకు గుహ బయట సైకిళ్లు కనిపించటంతో, వారు గుహల్లోకి వెళ్లి ఉంటారని గాలింపు మొదలు పెట్టారు.
గుహలో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావటం కోసం థాయ్ నేవీ సీల్ డైవర్స్తోపాటు ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు బ్రిటీష్ డైవర్స్, యూస్ఫసిఫిక్ కమాండ్కు చెందిన అమెరికా మిలిటరీ బృందం, పారా రెస్క్యూ సిబ్బంది, మరికొందరు రక్షణ నిపుణులు రంగంలోకి దించి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తమ పిల్లలు జీవించే ఉన్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు, వారంతా సజీవంగా బయటకు రావాలని థాయ్లాండ్ వాసులు ప్రార్థనలు చేస్తున్నారు.