పార్కింగ్ చేసిన కారులో బంగారం, నోట్ల కట్టలు
సికింద్రాబాద్ లో పార్క్ చేసిన కార్లలో కేజీల కొద్ది బంగారంతో పాటు కట్టల కొద్ది నగదు బయటపడటం కలకలం రేపింది.
సికింద్రాబాద్ లో పార్క్ చేసిన కార్లలో కేజీల కొద్ది బంగారంతో పాటు కట్టల కొద్ది నగదు బయటపడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ ప్రాంతంలో భారీగా నగదు, బంగారం అక్రమంగా తరలిస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు సమాచారం అందింది.
దీంతో సిబ్బందితో కలిసి ఆదివారం ఈస్ట్మారేడ్ పల్లి షెనాయ్ నర్సింగ్ హోం సమీపంలోని ఓ నివాస సముదాయంలో పార్క్ చేసిన ఆకుపచ్చ రంగు కారులోని సంచిలో నాలుగు కిలోల బరువున్న 40 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1,57,52,000 ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి ఇదే ప్రాంతంలోని మరో కారులో చేసిన తనిఖీల్లో రూ. 1.99 కోట్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి సంపాదించిన సొమ్ముగా వివరించారు.
పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు గాను నిందితులు ఈ సొమ్మును ఎంతో చాకచక్యంగా కారులోని హ్యాండ్ బ్రేక్ ఉండే చోట దాచారు. అక్కడ ఓ అర లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని అందులో నోట్ల కట్టలు పేర్చారని తెలిపారు.
ఈ బంగారాన్ని కేరళ నుంచి మైసూరు మీదుగా హైదరాబాద్కు అక్రమంగా రవాణా చేసినట్లు డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. నిందితులుగా భావిస్తోన్న ముగ్గురిని అరెస్ట్ చేసి కస్టమ్స్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:
విధుల్లోంచి సస్పెండ్: మనస్తాపంతో ఈవో ఆత్మహత్య
ఆర్కామ్ దివాళా: అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ