తెలుగు కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి కాళోజీ అవార్డు ప్రదానం
ప్రముఖ తెలంగాణ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డిని కాళోజీ అవార్డుతో సత్కరించారు. మంత్రి శ్రీనివాస గౌడ్ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మహమూద్ అలీతో పాటు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాకవి, పద్మవిభూషణ్ డా. కాళోజి నారాయణ రావు గారి 105 వ జయంతి ఉత్సవంలో ప్రముఖ కవి కోట్ల వెంకేటశ్వర రెడ్డికి కాళోజీ అవార్డు ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, హోమ్ శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీలు పాల్గొన్నారు. వారితో పాటు ప్రభుత్వ సలహాదారు డా. కెవి రమణా చారి, రామగుండం శాసన సభ్యుడు చందర్, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధ రెడ్డి, సంగీత, నాటక పరిషత్ చైర్మన్ బాదిమి శివ కుమార్, కాళోజి ఫౌండేషన్ ప్రతినిధి రామశర్మ , సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణృ కూడా పాల్గొన్నారు. కోట్ల వెంకటేశ్వర రెడ్డిని దుశ్శాలువా, మెమెంటో, లక్ష రూపాయల నగదుతో సత్కరించారు.
తెలంగాణకు జరిగిన అన్యాయాలను నిక్కచ్చిగా ఖండిస్తూ కలానేనే లక్ష మంది సైన్యంగా భావించిన మహాకమి కాళోజీ అని మంత్రి శ్రీనివాస గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజీకి తగిన గౌరవం లభిస్తోందని, వరంగల్ లో జరుగుతున్న కళా క్షేత్రం పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.