ఇంట్లో తలసాని పరిసరాల పరిశుభ్రత: దోమల నివారణకు విరుగుడు
తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం సికింద్రాబాదులోని వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్: సీజనల్ వ్యాధులు, డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పశుసంవర్ధక, మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం సికింద్రాబాదులోని వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధుల నివారణకు కృషి చేయాలని తలసాని సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలో అంటువ్యాధులు ప్రబలకుండా జిహెచ్ఎంసి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందని ఆయన చెప్పారు.
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన ఆస్పత్రులైన ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల్లో 25 మంది చొప్పున అదనపు డాక్టర్ల తో అదనపు ఓపి కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
95 అర్బన్ సెంటర్ లలో ఈవినింగ్ క్లినిక్ లను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 150 రకాల మందులు బస్తీ దవాఖాన లలో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.