మల్కాజిగిరిలో ఏడాది పాటు బాలికపై అత్యాచారం: కటకటాల వెనక్కి ఏఎస్ఐ
ఆర్పీఎఫ్ ఎఎస్సై హైదరాబాదులోని మల్కాజిగిరిలో ఏడాది కాలంగా ఓ బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. చివరకు అతన్ని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఎఎస్సైని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. శనివారంనాడు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన తంకచన్ లాలూ అలియాస్ లాలూ సెబాస్టియన్ (44) ఆర్ఫిఎఫ్ ముంబైలో ఎఎస్సైగా పనిచేస్తున్నాడు.
కొన్నేళ్లుగా సెబాస్టియన్ హైదరాబాదులోని మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నాడు. అదే అపార్టుమెంటులో ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు ఉద్యోగులు. తల్లిదండ్రులు వచ్చేవరకు అక్కాచెల్లెళ్లు ఎఎస్సై ఇంట్లో ఉండేవారు.
అయితే, పదో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ఏడాదిగా అత్యాచారం చేస్తూ వచ్చాడు.ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే, అతని వేధింపులను బాలిక తట్టుకోలేకపోయింది.
విషయాన్ని బాధితురాలు ఈ నెల 6వ తేదీన తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి 7వ తేీదన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎఎస్సైపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.